జగన్పై బాబు ఆగ్రహం, సొంత ఇలాకాలోనే చెక్ చెప్పేందుకు..: కడపలో వర్షం
విజయవాడ/కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అతని సొంత ఇలాకా కడప జిల్లాలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందుకే, నవ నిర్మాణ దీక్ష వేదికను ఒంగోలు నుంచి కడపకు మార్చారు.
నవ నిర్మాణ దీక్ష ముగింపు సభను తొలుత ఒంగోలులో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, జగన్ ఇటీవల అనంతపురం జిల్లాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చెప్పుతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో ఏం చేయలేదని ఆరోపించారు.
జగన్ తీవ్ర వ్యాఖ్యలు, విమర్శల నేపథ్యంలో అతని సొంత జిల్లాలోనే సమాధానం చెప్పాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే తొలుత ఒంగోలులో నిర్వహించాలనుకున్న సభను, ఇప్పుడు కడపకు మార్చారు. కడపలో జగన్ ప్రతి ప్రశ్నకు టిడిపి నేతలు సమాధానం చెప్పనున్నారు.
చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ నెరవేర్చడం లేదని జగన్ తన అనంత పర్యటనలలో విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ, ఉపాధి కల్పన, రుణమాఫీ.. తదితర ఏ హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కడపలోనే జగన్కు సమాధానం చెప్పాలని టిడిపి నిర్ణయించింది.
మహా సంకల్ప దీక్ష ప్రాంగణంలో వర్షం
కడప జిల్లాలో మహాసంకల్ప దీక్ష సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి యువనేత లోకేష్ హాజరు కానున్నారు. కడప జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. కడప జిల్లాలో కురుస్తోన్న వర్షం వల్ల దీక్ష జరిగే ప్రాంగణంలో వర్షపు నీరు చేరింది.
నవ నిర్మాణదీక్ష ముగింపు కార్యక్రమానికి కడప జిల్లా సన్నద్ధమవుతోన్న సమయంలో భారీ వర్షం కురవడంతో అక్కడికి చేరుకోనున్న టిడిపి కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కడప మున్సిపల్ మైదానంలో జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతారు.
ప్రత్యేక హోదా కోసం పోరాడుతా: విజయ సాయి రెడ్డి
వైసిపి నేత విజయ సాయి రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే సీబీఐ ప్రత్యేక కోర్టులో ఉన్న కారణంగా రెండు రోజుల క్రితం ఆయన తన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోలేదు. బుధవారం నాడు హైదరాబాదులోని అసెంబ్లీకి చేరుకున్న ఆయన అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన ధ్రువీరకణ పత్రాన్ని ఆయన అందుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినందుకు జగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సభలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సభలో పోరాడతానని ఆయన తెలిపారు.