బాబు ప్లాన్: పుట్టపర్తిలో విమానాల సర్వీసింగ్ కేంద్రం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 విమానాశ్రయాలను, పుట్టపర్తి వద్ద విమానాల సర్వీసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందట. ఈ దిశలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని విమానాశ్రయాలు ఉండగా, మరికొన్ని నూతనంగా నిర్మించాలని భావిస్తున్నారు.
శ్రీకాకుళం, చిత్తూరు జిల్లా కుప్పంలో విమానాశ్రయాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే విషయం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉంది. ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలు, అదనంగా ఏర్పాటు చేసేవి కలిపి మొత్తం 14 కావొచ్చునంటున్నారు.
పైవాటితో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలోను విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాలు నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేదని తేలింది. దీంతో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నెల్లూరులో మధ్యస్థాయి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజమండ్రి, పుట్టపర్తిల్లో మధ్యస్థాయి విమానాశ్రయాలు, కడపలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విమానాశ్రయం ఉంది. విజయవాడలో విమాన ఇంధనాన్ని నింపే కేంద్రం ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో కొనుగోలు చేసే విమాన ఇంధనంపై కేవలం ఒక్క శాతం మాత్రమే పన్ను వసూలు చేయాలని భావిస్తున్నారట. అలాగే పుట్టపర్తిలో విమానాల సర్వీసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారట.