ఒత్తిడితో చంద్రబాబు పరుష వ్యాఖ్యలు: కేంద్రంతో తాడో పేడో...
విజయవాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలోనూ, విభజన చట్టంలోని హామీలను అమలు చేయించడంలోనూ ప్రతిపక్షాల నుంచి, ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఆయన కేంద్ర ప్రభుత్వంపై కాస్తా కఠినంగా మాట్లాడినట్లు అర్థం చేసుకోవచ్చు.
విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్రం అమలు చేయాలి కదా అని అంటూ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బాధ్యత కేంద్రానికి ఉందా.. లేదా? అని ప్రశ్నించారు.. రాష్ట్రానికి రావలసిన వాటిని దక్కించుకునే విషయంలో కేంద్రంతో రాజీపడేది లేదని అన్నారు.
తాను మెతక మనిషినేం కాదని, దృఢచిత్తంతోనే ఉన్నానని అన్నారు. సోమవారం విజయవాడలో మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించిన సాయంలో సైతం కోత పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాసహా రాష్ట్రానికి రావలసిన అన్ని అంశాలపై ప్రధాని మోడీకి లేఖ రాయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.
హామీల అమలు కోసం తాను ఇప్పటికి 20-30 సార్లు కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిశానని చెప్పారు. ప్రధాని దృష్టి పెడితే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి సరైన సమాచారం ప్రధానికి అందుతోందా? లేదా? అని ఆయన అడిగారు.
నిబంధనల పేరిట కేంద్ర ప్రభుత్వ అధికారులు సాయంలో కోత విధిస్తున్నారని విమర్శించారు. విభజన తర్వాత తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లకు పైగా ఉంటే కేంద్రం రూ.2,800 కోట్లు మాత్రమే ఇచ్చిందని, రాజధానికి రూ.1300 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ. 700 కోట్లు మాత్రమే ఇచ్చిందని, ప్రత్యేక కేటగిరి హోదా, రైల్వే జోన్తో సహా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయని ఆయన వివరించారు.
విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు చాలవనే అప్పుడు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ముందుకొచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్ల పాటు ప్రత్యేక కేటగిరి హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రకటిస్తే పదేళ్లు ఇవ్వాలని వెంకయ్యనాయుడు, అరుణ్జైట్లీ డిమాండ్ చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.