మరోసారి మోడీపై విధేయత చాటుకున్న చంద్రబాబు..! నితీష్ హ్యాండిచ్చిన వేళ..!
గత ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసి విజయం సాధించిన బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీపై చంద్రబాబు వీర విధేయత ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రానికి కేవలం రెండే మంత్రి పదవులు విదిలించినా, నేరుగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు రాకపోయినా చంద్రబాబు మాత్రం ప్రధాని మోడీపై విధేయత మాత్రం కొనసాగిస్తున్నారు.
ఇవాళ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ఏపీ సీఎం హోదాలో పాల్గొన్నారు. అయితే ఇదే భేటీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా పలువురు విపక్ష ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. అలాగే ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన నితీష్ కుమార్ సైతం హాజరు కాలేదు. ఆయన తరఫున ప్రతినిధుల్ని మాత్రమే పంపారు. అయినా చంద్రబాబు మాత్రం స్వయంగా హజరై తన ప్రతిపాదనలు నీతి ఆయోగ్ ముందు ఉంచారు. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది.

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీలో పరిస్ధితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాష్ట్రం భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఇలాంటి కీలక సమయంలో నీతి ఆయోగ్ భేటీకి హాజరవడం ద్వారా కీలక అంశాల్లో సహకారం అందుకోవాలనేది చంద్రబాబు ఉద్దేశంగా ఉంది. అదే సమయంలో ఎన్డీయేలో బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షంగా కూడా చంద్రబాబు మరోసారి అందరినీ ఆకర్షించారు.












Click it and Unblock the Notifications