'బాబుకు పీక్ స్టేజ్లో పబ్లిసిటీ పిచ్చి, అందుకే కెసిఆర్ ఇంటికి', 'కాపులకు బాబు ఓకే'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి పీక్ స్టేజీకి చేరుకుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బ్రహ్మానంద రెడ్డి బుధవారం మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవన్న చంద్రబాబు తన ప్రచారానికి మాత్రం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.
రాజధాని శంకుస్థాపన పేరుతో రూ.కోట్లు ఖర్చు చేయడం సరికాదన్నారు. గోదావరి పుష్కరాలలో రూ.1650 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే అందులో రూ.1400 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న అతిథులకు వాళ్ల సొంత హోటల్స్లో విడిది ఏర్పాటు చేసి ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారన్నారు.
ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారన్నారు. పథకాల పేరుతో వందల కోట్లు దోచుకుంటున్నారన్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయన హైదరాబాద్ బయలుదేరుతున్నారు.
మరోవైపు, జగన్ దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వైసిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. బందర్ రోడ్డు వద్ద పోలీసులు అందర్నీ అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు.
కాపుల హామీపై సీఎం సానుకూలం: మాణిక్యాల రావు
కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి సానుకూలంగా ఉన్నారని మంత్రి, బిజెపి నేత పైడికొండల మాణిక్యాల రావు బుధవారం చెప్పారు. కాపు సంఘానికి చెందిన పలువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.