వాట్సాప్ మేసేజ్ లేనా ? ఫైళ్లు కూడా చూడండి- కలెక్టర్ల సదస్సులో సీఎం క్లాస్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. ఇందులో అభివృద్ది, సంక్షేమం రెండింటినీ పరుగులు తీయించేందుకు సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన విజన్ ను అనుగుణంగా మంత్రులు, అధికారులు పరుగులు తీయడం లేదని మరోసారి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ అమరావతి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం చేస్తున్న అధికారులు, మంత్రులపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.
వాట్సాప్ మెసేజ్ లపై పెడుతున్న శ్రద్ధ.. ఫైళ్ల క్లియరెన్స్ పై ఎందుకు చూపించడం లేదంటూ తన కేబినెట్లోని ముగ్గురు మంత్రులతో పాటు పలు శాఖల అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫోన్లు లేకుండా కొన్ని గంటలు కూడా ఉండలేకపోతున్నారా అని అసహనం వ్యక్తం చేశారు. అలాగే కలెక్టర్ల సదస్సుకు రాని అధికారులపైనా మండిపడ్డారు. కలెక్టర్ల సదస్సుకు గైర్హాజరు కావడానికి వారికి ఎంత ధైర్యం అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఆర్థికమంత్రి పయ్యావుల, రవాణామంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వద్ద ఫైళ్లు ఆలస్యమవుతున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే తన వద్ద కూడా ఫైళ్ల క్లియరెన్స్ కు నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు. దాన్ని తగ్గించుకోవాలన్నారు. మరోవైపు మంత్రులు, హెచ్ ఓడీలు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు తమ స్ధాయిలో ఫైళ్లను క్లియర్ చేయడానికి తీసుకుంటున్న సమయాలను స్వయంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. నిర్ణయాల్లో జాప్యాన్ని సహించేది లేదని వారికి తేల్చిచెప్పేశారు. అలాగే ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యానికి గల కారణాలపై వారి నుంచి వివరణ తీసుకోవాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి అధికారులపై 360 డిగ్రీల నిఘా పెడతానని హెచ్చరించారు. ఫైళ్ల క్లియరెన్స్ కు తీసుకునే సమయం పాలనపై ప్రభావం చూపుతుందని, కాబట్టి వేగంగా స్పందించి ప్రభుత్వానికి ఫలితాలు అందేలా చూడాలన్నారు.













Click it and Unblock the Notifications
