నాపై ఏడుపెందుకు, నాకన్నా బాగా చేయి: కెసిఆర్పై చంద్రబాబు మండిపాటు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. హైదరాబాదులో ఉండొద్దని తనను అనడానికి కెసిఆర్ ఎవరంటూ ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యులతో కలిసి ఆయన మంగళవారంనాడు సచివాలయంలో భోజనం చేశారు. ఈ సందర్భంగా తనపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.
తనకు ఇక్కడేం పని అనడానికి కేసీఆర్ ఎవరని, తెలంగాణతో తనది ముప్ఫై ఏళ్ల అనుబంధమని, తెలంగాణలో ఒక స్పష్టమైన అభివృద్ధికి పునాదులు వేసింది తానే అని చంద్రబాబు చెప్పుకున్నారు. రోడ్లు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాలలు, ఐటీ కంపెనీలు, గ్రామాల్లో మంచినీటి పథకాలు వంటి వన్నీ తన హయాంలోనే తెలంగాణలో వచ్చాయని ఆయన అన్నారు.
తాను అధికారంలోంచి దిగిపోయే సమయానికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని, ఎన్నో కంపెనీలను తాను తేవడం వల్ల హైదరాబాద్కు ఆదాయం పెరిగిందని, ఇవాళ దేశంలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందంటే ఆ శ్రమ తనదేనని అన్నారు.
ఈ ఆరు నెలల్లో కేసీఆర్ పాలన వల్ల తెలంగాణ మిగులు రాష్ట్రం కాలేదని, చేతనైతే తన కంటే బాగా చేసి చూపించాలని, తనపై ఏడిస్తే ఉపయోగం లేదని, భౌతికంగా విడిపోయింది నిజమని, కానీ మానసికంగా తెలుగువారంతా ఒకటేనని ఆయన అన్నారు. వారందరి కోసం తెలుగుదేశం పార్టీ అక్కడా ఉంటుంది, ఇక్కడా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో బడుగు బలహీనవర్గాలకు తమ వాణిని వినిపించే అవకాశం వచ్చి రాజకీయంగా ముందడుగు వేయగలిగారని, ఆ వర్గాల వాణి వినిపించకూడదని అనుకొనేవారే ఇక్కడ టీడీపీ ఉండకూడదని భావిస్తున్నారని చంద్రబాబు అన్నారు. తెలంగాణ పని చేసిన వాళ్లం మనమని, మనం లేకుండా ఎటుపోతామని చంద్రబాబు అన్నారు.