అంత సీన్ ఎందుకు, డిగ్గీ రావడమేంటి: టీ బిల్లుపై బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు పంపడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అలా పంపడం ద్వారా తెలుగుజాతిని చులకన చేశారని, తెలుగుజాతి గౌరవాన్ని దెబ్బ తీశారని ఆయన అన్నారు. ఇష్ఠానుసారంగా రాష్ట్ర విభజనపై ముందుకు వెళ్తే వదిలిపెట్టే సమస్యే లేదు, వెంటపడుతాని చంద్రబాబు హెచ్చరించారు. గురువారంనాడు ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు
రాష్ట్ర విభజనపై మంత్రుల బృందం (జీవోఎం) ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరగడం లేదని ఆయన అన్నారు. విభజన ముసాయిదా బిల్లును ఆగమేఘాలపై ప్రత్యేక విమానంలో పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన అడిగారు. ఒకవైపు విమానంలో బిల్లు రావడం, మరోవైపు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్సింగ్ హైదరాబాద్కు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

దిగ్విజయ్సింగ్ ఏమి చేయడానికని హైదరాబాద్కు వచ్చారని ఆయన ప్రశ్నించారు. అందరికి సమన్యాయం జరిగేలా చూడాల్సిన రాష్టప్రతి విభజన బిల్లుపై న్యాయ సలహా తీసుకోకుండానే అసెంబ్లీకి పంపించడం ఏమిటని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. అసెంబ్లీలో విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే పార్లమెంట్కు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటి నివేదికను పట్టించుకోలేదని, ఆంటోని కమిటి నివేదికను పట్టించుకోలేదని, జీవోఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్లో సీమాంధ్రులకు రక్షణ లేదని, వారి ఆస్తులకు, అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారిని తెలంగాణవాదులు బెదిరిస్తున్నారని ఆంటోని కమిటి తన నివేదికలో పేర్కొందని చంద్రబాబు గుర్తు చేశారు. ‘తెలంగాణ జాగో...ఆంధ్రవాలే భాగో', ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా' వంటి నినాదాలతో ఇక్కడ స్థిరపడిన సీమాంధ్ర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారని ఆంటోని కమిటీయే ఆందోళన వ్యక్తం చేస్తే, ఆ విషయాన్ని జీవోఎం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు.
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగిస్తామని ముసాయిదాలో చెప్పారని, ఉమ్మడి రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని చంద్రబాబు అన్నారు. అందరికి సమన్యాయం జరిగేలా చూడటమే తమ విధానమని స్పష్టం చేశారు.
అవిశ్వాస తీర్మానం పెట్టడంపై తమకు పెద్దగా ఆసక్తి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఎలాగూ మూడు నెలల్లో ఇంటికి పోతుంది, ఈ నాలుగు రోజులు ఉంటే ఎంత? పోతే ఎంత? దీని కోసం అవిశ్వాసం పెట్టి దించాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంట్ వాయిదా పడితే, ఈ సమావేశాల్లో విభజన బిల్లు చర్చకు రావడం అనుమానమేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్పై తన ఎదురుదాడి కొనసాగుతూనే ఉంటుందని, తాను ఎవరికీ భయపడనని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications