ముద్రగడ దీక్షపై బాబు ఆగ్రహం: అర్థాంతరంగా ప్రెస్ మీట్ ముగింపు
కడప: తుని ఘటనలో కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అరాచాకాలు సృష్టిస్తే వ్యవస్థను ఎవరు కాపాడాలని ఆయన అడిగారు. గురువారం ఉదయం ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు.
తుని ఘటనలో బయటి శక్తులు పాల్గొన్నాయని ఆయన అన్నారు. పోలీసులపై దాడి చేసిన వారిని వదిలేయమంటారా అని అడిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అవసరమని అన్నారు. కాపుల డిమాండ్ల విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని చంద్రబాబు చెప్పారు. కాపుల సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నామని ఆయన అన్నారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించిని వైయస్ మీకు దేవుడయ్యాడా, రిజర్వేషన్లు కల్పిస్తూ సంక్షేమాన్ని చూస్తున్న నేను శత్రువునయ్యానా అని అడిగారు. ముద్రగడ దీక్ష బ్లాక్ మెయిల్ చేయడమేనని ఆయన అన్నారు. తాము ఇచ్చిన హామీలు ఏమిటి, అమలు చేసిందేమిటి అంటూ చంద్రబాబు మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు.
ముద్రగడ దీక్ష చేపట్టడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. తుని విధ్వంసం ఘటనలో కేసులు ఎత్తివేయాలనడం సరికాదని చినరాజప్ప గురువారం మీడియాతో అన్నారు. కేసుల ఎత్తివేతకు అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కాపు విద్యర్థులకు స్కాలర్ షిప్స్, .కాపు యువతకు ఉపాధి ఇప్పటికే కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాపులకు ఈ స్థాయి సహాయం ఏ ప్రభుత్వం గతంలో చేయలేదని, అయినా ముద్రగడ దీక్ష చేయడం దురదృష్టకరమని చినరాజప్ప అన్నారు.