సంతోషం: సదావర్తి భూములపై చంద్రబాబు స్పందన ఇదీ...
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సదావర్తి భూముల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు స్పందించారు.
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సదావర్తి భూముల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు స్పందించారు. రూ. 5కోట్లు ఎక్కువ ఇస్తే ఆ భూములు ఇస్తామని గతంలోనే తాము చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు రూ.5 కోట్ల ఆదాయం ఎక్కువ రావడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. సదావర్త భూములను వేలంపాటలో దక్కించుకున్న మొత్తానకి ఎవరైనా ఐదు కోట్లు అదనంగా ఇస్తే వారికే కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం విసిరిన సవాల్ను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వీకరించారు. హైకోర్టు వేదికగా ఆయన ఆ సవాల్ను స్వీకరించారు.
కాగా, తెలుగుదేశం పార్టీ (టిడిపి) రాష్ట్ర పార్టీ సమావేశం మంగళవారం విజయవాడలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ాపటు మంత్రులు, పార్టీఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అదనంగా 100 జబ్బులకు చికిత్స అందించాలన్నారు. చంద్రన్న బీమా ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పించామని తెలిపారు.
ప్రభుత్వ సేవల వినియోగంలో కొందరు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. చాపరాయి ఘటనే ఇందుకు ఉదాహరణ అని చంద్రబాబు గుర్తు చేశారు. గిరిజనుల్లో వైద్యం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జ్లు ఈ బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు.