చిత్తూరు జిల్లా పర్యటనలో మళ్ళీ తన భార్యకు జరిగిన అవమానంపై ఆవేదనతో చంద్రబాబు.. ఏం చెప్పారంటే!!
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వరదలతో అతలాకుతలమైన రాయలసీమలో పర్యటిస్తున్నారు. మంగళవారం నాడు కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు, బుధవారం నాడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో మానవ తప్పిదం వల్లనే వరదలు వచ్చాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియదని, సరైన సమయంలో స్పందించక పోవడం వల్ల, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాపా నాయుడు పేట వద్ద వరద బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు గొలుసుకట్టు చెరువులు ఉంటే వాటిలోకి వరద రాకముందే నీటిని విడిచిపెట్టాల్సి ఉంటుందని అలా చేయని పక్షంలోనే మిగతా చెరువుల్లో నీరు నిండిపోయి వరదలు వచ్చే ప్రమాదం ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వానికి అవగాహన లేక రాష్ట్రం ఇంత దారుణ పరిస్థితులకు చేరుకుందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
వరద నియంత్రణ చర్యలపై విఫలమైన చంద్రబాబు
తాను సీఎంగా పనిచేసిన సమయంలో రాత్రింబవళ్లు అధికారులను అప్రమత్తం చేశానని, క్షేత్రస్థాయిలో కలెక్టర్లను పంపి నియంత్రణ చర్యలు చేపట్టామని,వరద సహాయక చర్యలను కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహించామని చంద్రబాబు వెల్లడించారు. కానీ ఈ ప్రభుత్వం వరద సహాయక చర్యలపై విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు.
వరద బాధితులు, మృతుల కుటుంబాలకు సహాయం అందించే వరకూ తాను వారికి అండగా ఉంటానని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఎక్కడా? ప్రజలు చనిపోయాక వచ్చి పరామర్శిస్తారా? అంటూ మండిపడ్డారు.
తన భార్యపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడిన చంద్రబాబు
ఇక ఇదే సమయంలో తాను ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నానని పేర్కొన్న చంద్రబాబు, టిడిపి 22 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఎన్నడూ తన సతీమణి బయటకు రాలేదని అసెంబ్లీలో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని మరోమారు చిత్తూరు జిల్లా వేదికగా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నానని చెప్పిన ఆయన అలిపిరిలో తన కారుపై మందుపాతర పేలినా భయపడలేదని, కానీ తన సతీమణి పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర ఆవేదనకు గురయ్యాను అని పేర్కొన్నారు.
మీ వాళ్లకు అవమానం జరిగితే మీరు బాధ పడరా? ప్రశ్నించిన చంద్రబాబు
మీ భార్య, మీ చెల్లి, తల్లికి ఇలాంటి అవమానం జరిగితే మీరు బాధ పడరా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. కౌరవసభలో ఉండలేనని చెప్పి బయటకు వచ్చేసాను అని ప్రజా క్షేత్రంలోనే ప్రజల వద్ద తేల్చుకుంటాం అని చెప్పానని పేర్కొన్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రజల సమస్యల కోసమే పోరాటం చేస్తుందంటూ వెల్లడించారు. ఇదే సమయంలో తప్పుడు పనులు చేసే వారిని వదిలి పెట్టనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి పెట్టిన అక్రమ కేసులపై విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ పోరాటం చేస్తుంది ఎందుకో ప్రజలే ఆలోచించాలి
ఇదే సమయంలో కుప్పంలో వైసీపీ విజయం పై మాట్లాడిన చంద్రబాబు రాజకీయం చేసి కుప్పంలో వైసీపీ మునిసిపాలిటీని గెలిచిందని ఇక అదేదో గొప్ప విజయంగా చెప్పుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. అక్రమాలు చేసి మొనగాళ్లమని విఱ్ఱవీగుతున్నారు అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడే బాధ్యత ప్రజల పైన ఉందని చెప్పిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎవరి కోసం పోరాటం చేస్తున్నదో ఆలోచించాల్సిన అవసరం 5 కోట్ల ప్రజలకు ఉందని తేల్చి చెప్పారు. గత టీడీపీ హయాంలో తాను కంపెనీలు తీసుకువస్తే ఇప్పుడు వైసిపి హయాంలో దందాలు చేస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నారని మండిపడిన చంద్రబాబు, ఇలాంటి ఉన్మాదులతో పోరాటం చేయాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు.