ఎక్కువ పిల్లల్ని కనాల్సిందే-త్వరలో ఏపీ సర్కార్ చట్టం..!
ఏపీలో నానాటికీ తగ్గిపోతున్న యువ జనాభాను పెంచేందుకు కూటమి ప్రభుత్వం త్వరలో ఓ చట్టం తీసుకురానుంది. రాష్ట్ర జనాభాలో యువ జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా త్వరలో చట్టం చేయబోతోందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల సమయంలోనే ఈ విషయం ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు తాజాగా అమరావతి పనుల పునఃప్రారంభంలో చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండేలా త్వరలో ఓ చట్టం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందించడం, దంపతులకు ఎక్కువ మంది పిల్లలు పుట్టేలా ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించే పాత చట్టాన్ని రద్దు చేసినట్లు చంద్రబాబు తెలిపారు.

ఇప్పటికే గతంలో ఉన్న ఇద్దరు పిల్లల చట్టాన్ని ఆగస్టు 7న రాష్ట్ర కేబినెట్ రద్దు చేసింది.ఈ నేపథ్యంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు మాత్రమే పోటీకి అర్హులయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అనేక జిల్లాల్లో యువత ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వలస వెళ్లిపోవడంతో గ్రామాల్లో వృద్ధులు మాత్రమే మిగిలి ఉన్నారని చంద్రబాబు తాజాగా వెల్లడించారు.
మనకు 2047 వరకు మాత్రమే జనాభా ప్రయోజనం ఉందని, 2047 తర్వాత ఏపీలో యువకుల కంటే వృద్ధులు ఎక్కువ మంది ఉంటారని ఆయన అంచనా వేశారు. ఇది ఇప్పటికే జపాన్, చైనా, ఐరోపాలోని అనేక దేశాలలో జరుగుతోందన్నారు. కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కనడం మీ బాధ్యత అని తెలిపారు.












Click it and Unblock the Notifications