కూటమి పాలనకు ఏడాది-ఎల్లుండి అమరావతిలో భారీ సభ..!
ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీని పూర్తి స్ధాయిలో మట్టికరిపించి 164 సీట్లతో అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ మెజార్టీతో తను గెలిపించిన ప్రజలకు దగ్గరయ్యేందుకు, వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీన్ని రాష్ట్ర పండుగగా కూడా గుర్తించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి సమీపంలో ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కేంద్రమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల అధ్యక్షులు, కీలక నేతలు హాజరవుతారు. ఈ సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే ఏడాది పాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ విజన్ వంటి అంశాలపై వివిధ శాఖలు ప్రజంటేషన్లు ఇచ్చేందుకు సిద్ధం కావాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో కోరింది. దీంతో పాటు ప్రభుత్వం తమ విజన్ ను వివరించనుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలైన హామీలతో పాటు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై ప్రణాళికను కూడా సీఎం చంద్రబాబు ఇక్కడ విడుదల చేయబోతున్నారు.
రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉంది. మూడు పార్టీలతో కూడిన కూటమి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏడాది పూర్తి చేసుకుంది. కాబట్టి మూడు పార్టీల అధినేతలు, ఇతర నేతలు ఈ సభకు హాజరై దీనిపైనా ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications