పదేళ్లైనా పూర్తి కావు, ఇష్టానుసారం: చంద్రబాబు
హైదరాబాద్: నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెసు ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని, మరో పదేళ్లయినా కాంగ్రెసు ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కాలేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాజెక్టులన్నీ ఒకేసారి ప్రారంభించారని, సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయలేదని, భూసేకరణ కూడా చేయలేకపోయారని, దీంతో నిధులు రాకుండా పోయాయని, ఈ విషయం కేంద్ర జలవనరుల సంఘం చెప్పిందని ఆయన అన్నారు.
చంద్రబాబు సోమవారం నీటిపారుదలపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఇష్టానుసారంగా కాంగ్రెసు ప్రభుత్వం వ్యవహరించిందని, ప్రాజెక్టులు ప్రారంభించి, దేన్నీ పూర్తి చేయలేదని, వేల కోట్లు ఖర్చు చేసి పొలాలకు నీళ్లు ఇవ్వలేకపోయారని ఆయన అన్నారు. ఏ ప్రాజెక్టుకూ క్లియరెన్స్ లేదని, ఆయకట్టు పెరగలేదని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆయన అన్నారు.
ఓ ప్రాజెక్టును ప్రారంభించి కొంత పనులు చేసి, మరో ప్రాజెక్టు చేపట్టారని, ఇలా ప్రాజెక్టులను చేపట్టారని, అధికరంలో ఉన్నవారు డబ్బులు దండుకున్నారని ఆయన అన్నారు. ఎత్తిపోతల పథకాలకు వేలాది మెగావాట్ల విద్యుత్తు అవసరమని, ఇప్పుడు విపరీతమైన కరెంట్ కొరత ఉందని, పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని, ఎత్తిపోతలకు విద్యుత్తు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలేదని ఆయన అన్నారు.
ఇష్టానుసారంగా ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులు తీసుకుని డబ్బులు వసూలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాగ్ పలుమార్లు తప్పు పట్టిందని ఆయన అన్నారు. ఇప్పుడు మనం ఏదైనా చేసుకుందామంటే కృష్ణా, గోదావరి నదులపై రాష్ట్ర విభజనతో బోర్డులు, అపెక్స్ బాడీలు వేశారని ఆయన అన్నారు.
బాబ్లీకి వ్యతిరేకంగా పోరాటం చేశామని ఆయన అన్నారు. మహారాష్ట్ర వెళ్లి అరెస్టు కూడా అయ్యామని ఆయన అన్నారు. గోదావరి నదీ జలాలను రక్షించుకోలేకపోయామని ఆయన అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుండా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్యలు తీసుకున్నానని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ఆల్మట్టి ఎత్తు పెంచకూడదని చెప్పిందని ఆయన అన్నారు. బ్రిజేష్ కమిటీ ముందు అప్పటి ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోయిందని ఆయన అన్నారు. మన హక్కులను అప్పటి ప్రభుత్వం కాపాడలేకపోయారని ఆయన అన్నారు.
ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యతలను తిరిగి పునర్విచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అనంపురం జిల్లాకు చెరువుల ద్వారా డ్రిప్ ఇర్రిగేషన్ వంటి పథకాల ద్వారా నీళ్లు అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు నిర్వాకమే రాష్ట్ర విభజనకు దారి తీసిందని ఆయన అన్నారు. సవాల్గా తీసుకుని తక్కువ వ్యవధిలో చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. స్వేచ్ఛ లేకుండా చేశారని ఆయన అన్నారు. లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే పెట్టిన పెట్టుబడులు వృధా అయిపోతాయని ఆయన అన్నారు. డ్రిప్ ఇర్రిగేషన్, స్ప్రింక్లర్ ఇర్రిగేషన్ ద్వారా వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తే మేలు జరుగుతుందని ఆయన అన్నారు.
కష్టమైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలితే చాలా మేలు జరుగుతుందని ఆయన అన్నారు. దానికి క్లియరెన్స్ వచ్చిందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తూనే జల సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.