సాక్షి పత్రిక చదివితే ఆరోగ్యం పాడు, విసుగు: చంద్రబాబు, రూ.821 కోట్ల ఆర్జన
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ఇసుక రీచ్ల పైన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఆ పేపర్ (సాక్షి) చదివితే విసుకు వస్తుందని, అంతా తప్పుడు సమాచారం ఇస్తుందని దుయ్యబట్టారు. ఆ పేపర్ చదవొద్దని, అలాగే ఆ టీవీ (సాక్షి టీవీ) చూడవద్దని అన్నారు. ఆ పేపర్ చదివినా, ఆ టీవీ చూసినా మీ ఆరోగ్యం పాడవుతుందన్నారు. విసుగు వస్తుందన్నారు.
అన్ని పార్టీలకు పేపర్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపి.. ఇలా ఏ పార్టీకి పేపర్ ఉందో చెప్పాలన్నారు. ఆ పేపర్ ఇష్టారీతిన రాస్తే ఎలా అని నిలదీశారు. తాను ముఖ్యమంత్రిగా వాస్తవాలు అందరి ముందు ఉంచుతున్నానని చెప్పారు. ఆ దిన పత్రిక అవినీతి డబ్బుతో పెట్టిన పార్టీ అన్నారు.
ఇసుక రీచుల పైన శ్వేతపత్రం
చంద్రబాబు ఇసుక రీచ్ల పైన శ్వేతపత్రం విడుదల చేశారు. 2015 నవంబర్ నాటికి 387 ఇసుక రీచ్లు ఉన్నట్లు చెప్పారు. కోటి 37 లక్షల 89వేల మందికి ఇసుకను అమ్మినట్లు చెప్పారు. 2 కోట్ల 82 లక్షల 8వేల 132 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరిపినట్లు పేర్కొన్నారు.
ఇసుక రీచ్లను 4,023 స్వయం సహాయక బృందాలు జరిపాయన్నారు. ఇసుక అమ్మకం ద్వారా రూ.821.21 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా, అత్యల్పంగా ప్రకాశం జిల్లా నుంచి ఆదాయం వచ్చిందని తెలిపారు.
తూర్పు గోదావరి రూ.143 కోట్లు, కృష్ణా రూ.140 కోట్లు, గుంటూరు రూ.134 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.118 కోట్లు, ప్రకాశం రూ.12.79 కోట్ల ఆదాయం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ఇసుక తవ్వకాలలో దోపిడీని అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని చెప్పారు. దోపిడీని తమ ప్రభుత్వం అరికట్టిందన్నారు. ఇసుక రీచ్లలో సీసీ టీవీలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. వాహనాలకు జీబీఎస్ కనెక్ట్ చేసినట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లో పర్యవేక్షించేందుకు విజయవాడలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇసుక తవ్వకాలలో తాము పారదర్శకత పెంచామన్నారు.