లోకేష్ చెప్తే వదులుకున్నా, ఎన్టీఆర్కు నేనే చెప్పా: చంద్రబాబు
హైదరాబాద్: తన వివాహ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత స్మృతులను నెమరేసుకున్నారు. ఆ స్మృుతలను ఆయన శనివారం మీడియాతో పంచుకున్నారు. తన జీవితంలోని ఆసక్తికరమైన పలు వ్యక్తిగత, రాజకీయ విశేషాలను ఆయన వెల్లడించారు.
చెన్నైలో నా వివాహం ఎంతో ఘనంగా జరిగిందని చెప్పారు. తన వివాహానికి ఎందరో ప్రముఖులు వచ్చారని చెప్పారు. చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది వచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్ను తాము కట్నం అడగలేదని, ఆయన ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. బాలకృష్ణ కోసం కట్టిన ఇంట్లో ఉండమని ఎన్టీఆర్ చెప్పినప్పుడు వద్దన్నట్లు తెలిపారు.
23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీకి సిద్ధమయ్యానని, అప్పటికి వయసు సరిపోదన్న విషయం తనకవు తెలియదని అన్నారు. 28 ఏళ్లకు శాసనసభ్యుడినయ్యా. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు చాలా ఆవేశంగా ఉండేవాడినని చెప్పుకున్నారు. రాత్రికి రాత్రే మొత్తం మార్పు తేవాలన్నట్లు ఉండేవాడ్ని అని చెప్పారు.
మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెన్నారెడ్డిని అడిగితే వయసులో ఉన్నావు.. అప్పుడే మంత్రిపదవా అన్నట్లు తెలిపారు. ఆ తర్వాత అంజయ్య మంత్రివర్గంలో అవకాశం వచ్చిందని, ఎన్టీ రామారావు కుమారుడు జయకృష్ణ తన దగ్గరకు వస్తుండేవాడని అన్నారు.
ఎన్టీఆర్ను కలవాలనుకుంటున్నానని ఆయనతో చెప్తే ఎన్టీఆర్ను 'అనురాగదేవత' సినిమా చిత్రీకరణలో కలిశానని చంద్రబాబు చెప్పారు. రాజకీయాలు బాగుచేయడానికి మీలాంటివాళ్లు రావాలని సూచించానని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్కు తానే చెప్పానని ఆయన అన్నారు
అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసినప్పుడు చాలా చర్చ జరిగిందని, కలాం అభ్యర్థిత్వంపై అప్పుడు వాజ్పేయిని ఒప్పించామని అన్నారు. ప్రధాని అవకాశం తనకు వచ్చినప్పుడు అది టెంపరరీ జాబ్ వంటిది, సిఎం పదవి పర్మినెంట్ జాబ్ అని లోకేష్ అన్నట్లు చంద్రబాబు తెలిపారు. లోకేష్ చెప్పడంతో తాను ప్రధాని పదవిని వదులుకున్నట్లు తెలిపారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ రాజీనామాను తాను అడిగానని, అప్పుడు అలా ఎందుకడిగానో మోడీకి వివరించానని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా అ విషయంపై వివరించానని అన్నారు.