ఆ రైలు తగులబెట్టించింది చంద్రబాబే: జగన్, మీ గూండాలే: టీడీపీ
అమరావతి: నాడు కాపు ఉద్యమం సమయంలో రైలు తగలబడిపోవడానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కాపు ఉద్యమం సమయంలో తునిలో చంద్రబాబు కుట్రపూరితంగా రైలు తగలబెట్టించారని మండిపడ్డారు.
ఎదుటివారిపై దొంగ కేసులు పెట్టించారన్నారు. ఎస్సీ, బీసీ, మహిళలు, వికలాంగులపైన కూడా విచక్షణ లేకుండా కేసులు పెట్టారన్నారు. ఆనాడు కాపు ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతు ఇచ్చామని, అధికారంలోకి వస్తే తుని ఘటనలో పెట్టిన కేసులన్నీ పూర్తిగా తొలగిస్తామన్నారు. ఆయన తునిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
తుని ఘటనలో కేసులు ఎదుర్కొంటున్న వారిలో 75 శాతం మంది వైసీపీ కార్యకర్తలే అన్నారు. తుని నియోజకవర్గం, అభివృద్ధిలో కాకుండా అవినీతిలో పరుగులు పెడుతోందన్నారు. ఇక్కడ కాంట్రాక్టులు అన్నీ టీడీపీ నేతలు అక్రమ పద్ధతిలో దక్కించుకుంటున్నారని ఆరోపించారు.
పోలవరం ఎడమ కాలువలో అయిదో ప్యాకేజీ పనులు 18 కిలోమీటర్ల పొడవు జరగాల్సి ఉందని, రూ.180 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇక రూ.50 నుంచి రూ.60 కోట్లు పనులే చేయాల్సి ఉందని, కానీ యనమల బంధువు రూ.280 కోట్లకు ఈ పనులు దక్కించుకున్నారని మండిపడ్డారు.
మీ గూండాలే తగులబెట్టారు
తునిలో ముఖ్యమంత్రి చంద్రబాబే రైలు తగులబెట్టించారన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. ఇది ఆయన ఫ్యాక్షన్ స్వభావానికి నిదర్శనం అన్నారు. అప్పట్లో ప్రశాంతంగా జరుగుతున్న సభలో అల్లర్లు సృష్టించింది జగనేనని, ఆయన పంపిన గూండాలే రైలు తగులబెట్టారన్నారు.