టిడిపి బ్రాందీ సీసా కాదు: కెసిఆర్పై బాబు నిప్పులు
హైదరాబాద్: ఖాళీ చేయడానికి తమ పార్టీ బ్రాందీ సీసా కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఉద్దేశించి అన్నారు. కెసిఆర్పై చంద్రబాబు మంగళవారం నిప్పులు చెరిగారు. రాజకీయ జీవితం ఇచ్చిన తననే కెసిఆర్ విమర్శిస్తున్నారని, అటువంటి కెసిఆర్కు తల్లిని గౌరవించే సంస్కృతి లేదని ఆయన అన్నారు.
తమ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో తన వద్ద కెసిఆర్ రాజకీయ పాఠాలు నేర్చుకున్నారని, గురువునైన తనకే కెసిఆర్ పంగనామాలు పెడుతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ గడ్డపై తాను పేదోళ్ల రాజ్యం స్థాపిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణకు బిసినే ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన అన్నారు.
ఆంధ్రోళ్లకు తెలంగాణలో పనేమిటని కెసిఆర్ అంటున్నారని, తాను ఇక్కడే ఉంటానని, తెలంగాణలో వంద మంది చంద్రబాబులను తయారు చేస్తానని ఆయన అన్నారు. ఆంధ్రోళ్లు అంటున్న కెసిఆర్ తాను ఎక్కడి నుంచి వచ్చాననే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా విస్తరిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి వస్తే ఆయన కుటుంబంలోనివాళ్లకే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. తనను సంప్రదించకుండానే తెలంగాణ ఇచ్చారని కెసిఆర్ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. పార్టీ పెట్టినప్పుడు కెసిఆర్ ఆస్తులు ఎంత, ఇప్పుడెంత అని చంద్రబాబు ప్రశ్నించారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అవినీతి అనకొండ అని, కాంగ్రెసు నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పిల్ల అనకొండలని ఆయన వ్యాఖ్యానించారు. పేదవాళ్లకు అందాల్సిన ఆదాయాన్ని కాంగ్రెసు నేతలు దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని, ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చామని ఆయన అన్నారు.