చెల్లుబాటు అవుతుందని...: జగన్కు బాబు చురకలు
హైదరాబాద్: తాను గుంటూరు - విజయవాడ మధ్య ప్రమాణ స్వీకారం చేయడం హంగామ కోసం కాదని, ప్రజలకు భరోసా ఇవ్వడానికి మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాదులో మహానాడు, తిరుపతిలో టిడఎల్పీ సమావేశం, విజయవాడ - గుంటూరు మధ్య ప్రమాణ స్వీకారం చేపట్టామని, విశాఖపట్నంలో మంత్రి వర్గ సమావేశం పెడుతున్నామని ఆయన చెబుతూ ఇదంతా తెలుగు ప్రజలను కలపడానికి, అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
విభజన వల్ల జరిగిన నష్టం గురించి చెబుతామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రత్యేక పరిస్థితుల వల్లనే సీమాంధ్రలో ఆ రకంగా తాను ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ప్రజలు అభద్రతా భావం ఉందని, వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని, అభివృద్ధికి తాము సంఘటితంగా కట్టుబడి ఉన్నామని చెప్పడానికి, అందరం వెళ్లి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని భావించి ప్రమాణ స్వీకారం అలా చేశామని ఆయన చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాసిన లేఖపై ఆయన స్పందించారు. అప్పుడే లేఖలు రాస్తున్నారని ఆయన అన్నారు. చాలా సమస్యలున్నాయని, అన్ని శక్తులనూ కూడగట్టుకున్నామని ఆయన చెప్పారు. ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారని ఆయన అన్నారు. అనుభవం లేనివారు ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన జగన్పై చురకలు వేశారు. పద్థతి తెలియకుండా లేఖలు రాస్తే ఎలా అని ఆయన అడిగారు. తాను బాధ్యతలు చేపట్టిన మర్నాడే లేఖ రాయడమేమిటని జగన్ తీరును ప్రశ్నించారు.
పునాదుల నుంచి నిర్మించాల్సిన అవసరం ఉందని, అందుకే అందరి సహకారం కోరుతున్నానని, ప్రతిపక్షాలను కూడా కలిసి రావాలని అంటున్నానని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు కెసిఆర్ ఏం చేశారని ఆయన అడిగారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కూడా మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. కేంద్రం సాయంతో ఎపిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. రేపటి నుంచి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతానని ఆయన చెప్పారు.
సమస్యల అధ్యయనానికి కొంత సమయం పడుతుందని చంద్రబాబు చెప్పారు. ఎపి అభివృద్ధికి కావాల్సింది చిత్తశుద్ధి అని, రాజకీయాలు కాదని ఆయన జగన్ను ఉద్దేశించి అన్నారు. ప్రజల ఆత్మవిశ్వాసం పెంచేందుకే ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా భారీ బహిరంగ సభ పెట్టామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని, అందుకు ఐదేళ్లా, పదేళ్లా ఎంత కాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్థుల కోసం వెతకాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సహాయక చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని వ్యవహరించాలని తాను తమ పార్టీ నాయకులకు చెప్పినట్లు ఆయన తెలిపారు. మనం చేసినా, వాళ్లు చేసినా బాధితులకు న్యాయం జరగాలని ఆయన అన్నారు. రాజకీయాలు వేరు, విపత్తులు వేరని, ముందు బాధితులను ఆదుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వమా, మరో ప్రభుత్వమా అనేది ముఖ్యం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications