నాన్న వైయస్ తప్పు చేశాడని అన్నారు: జగన్పై బాబు
విజయవాడ: కృష్ణా జలాల విషయంలో తమ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి తప్పు చేశారని, మీరు ఎందుకు సరి చేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారని, మిగులు జలాలపై హక్కును వదులుకుంటూ వైయస్ రాజశేఖర రెడ్డి రాసిన లేఖ వల్ల నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని కృష్ణా బ్యారేజీ వద్ద బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ పార్టీ చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల సకాలంలో నీళ్లు రావని, దానివల్ల తుఫానుల తాకిడికి పంటలు గురయ్యే ప్రమాదం ఉందని చంద్రబాబు అన్నారు. ఆల్మట్టి ఎత్తు ఎందుకు పెంచకూడదో ఆంధ్రప్రదేశ్ సరిగా చెప్పలేకపోయారని బ్రిజేష్ కుమర్ అన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం నియమించిన సుదర్శన్ రెడ్డి అసమర్థుడని, అతన్ని వైయస్ రాజశేఖర రెడ్డి నియమించారని చంద్రబాబు అన్నారు.

జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారని ఆయన వైయస్పై ధ్వజమెత్తారు. అదనపు ఆయకట్టు తయారు చేయలేదని, పైగా ఆయకట్టు తగ్గిందని ఆయన అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రంలోని 14 జిల్లాల ప్రజలకు మంచినీరు, సాగునీరు అందదని ఆయన అన్నారు. కృష్ణా జలాల విషయంలో మన హక్కులను కాపాడుకోలేని స్థితి నెలకొందని ఆయన అన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టులను అన్నింటినీ ఎన్టీఆర్ ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.
కర్ణాటకలో పార్టీలకు అతీతంగా వ్యవహరించారని, దాంతో వారు వాదనను గెలిపించుకున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువన ఉందని, కష్టాలు వెనకే ఉన్నాయని ఆయన అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను రద్దు చేయాలని ఆయన అన్నారు. కరువులు, వరదలు వస్తే మనకే నష్టం కాబ్టిట మిగులు జలాలపై మనకే హక్కు ఉండాలని చంద్రబాబు అన్నారు. తాము కర్ణాటకపై పోరాడేందుకు తెలివైన న్యాయవాదులను పెట్టామని, కర్ణాటక ముఖ్యమంత్రితో క్షమాపణలు చెప్పించామని ఆయన అన్నారు.
కృష్ణా, గోదావరి జలాలపై హక్కును కాకుండా తెలుగువారి అన్ని హక్కులను ఎన్టీఆర్ కాపాడారని, తెలుగువారి జోలికి వస్తే ఎన్టీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని ఆయన అన్నారు. తెలుగువారికి ఒకప్పుడు గౌరవం లేదని, తెలుగువారిని చులకనగా చూసేవారని, ఇటువంటి స్థితిలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం, రాజకీయాల కోసం రాలేదని ఆయన చెప్పారు. తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications