లీకులతో ఆగిపోయిన జగన్-వాడేసుకున్న చంద్రబాబు-క్రెడిబిలిటీ గేమ్ లో ఎవరెక్కడ ?
దేశమంతా రాజకీయాలు ఉన్నా ఏపీలో రాజకీయాల స్టైలే వేరు. ఇక్కడ విశ్వసనీయత కోసం నిరంతరం పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇందులో తానే ఛాంపియన్ అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకుంటుంటే, తాను మాటిస్తే మాత్రం నిలబెట్టుకుంటానని చంద్రబాబు హామీ ఇస్తుంటారు. అలాగే ప్రభుత్వ విధానాలపై ప్రజాస్పందన తెలుసుకునేందుకు ముందుగా లీకులు ఇచ్చే సంప్రదాయాన్ని చంద్రబాబు మొదలుపెడితే ఇప్పుడు జగన్ కూడా కొనసాగిస్తున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా ఓ విషయంలో మాత్రం జగన్ లీకు ఇచ్చి వెనక్కి తగ్గారు. కానీ దాన్ని చంద్రబాబు వాడేసుకున్నారు.
జగన్ వర్సెస్ చంద్రబాబు
ఏపీ రాజకీయాల్లో దశాబ్దం క్రితం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పుట్టిన వైసీపీ.. ఈ పదేళ్లలో బలీయశక్తిగా ఎదిగింది. దీనికి కారణం వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పుకునే విశ్వసనీయత. మాట తప్పను, మడమ తిప్పను అంటూ జగన్ నిత్యం చెప్పే మాటలకు అనుగుణంగానే ఆయన చేతలు కూడా ఉంటాయనే విషయంలో మెజారిటీ జనం సానుకూలంగానే ఉంటారు. అదే చంద్రబాబుకు వచ్చేసరికి ఆ క్రెడిబిలిటీ లేదనే విషయాన్ని కూడా వైసీపీ బలంగా ప్రచారం చేస్తుంటుంది. దీంతో వీరిద్దరి మధ్య పలు అంశాల్లో ఇప్పటికీ క్రెడిబిలిటీ గేమ్ కొనసాగుతోంది.
జగన్ కొత్త జిల్లా లీకు
ఏపీలో వైసీపీ ఎన్నికల హామీ మేరకు 13 జిల్లాల్ని కాస్తా 26 జిల్లాలుగా జగన్ మార్చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు చేస్తానని చెప్పి చివరకు 25 సీట్లలో 26 జిల్లాల్ని ఏర్పాటు చేశారు. అయినా ఇంకా ఏదో లోటు. దీంతో మరో జిల్లా కూడా ఏర్పాటు చేస్తామని అప్పటి సమాచార మంత్రి పేర్నినానితో లీకు ఇప్పించారు. దీంతో ఏపీలో 27వ జిల్లా ఏర్పాటు కూడా ఖాయమని అంతా భావించారు. కానీ దీనిపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందో లేక మరే ఇతర కారణంతోనే ఆ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన అక్కడికే ఆగిపోయింది. ప్రస్తుతం 26 జిల్లాలు మాత్రమే ముందుకెళ్లాయి. దీంతోపాటే 27వ జిల్లా చర్చ కూడా మరుగునపడింది.
వాడేసుకున్న చంద్రబాబు
ఏపీలో గిరిజన ప్రాంతాలైన పోలవరం, రంపచోడవరం కలిపి మరో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ పేర్నినానితో జగన్ ఇప్పించిన లీకుపై ప్రభుత్వం ముందుకెళ్లలేదు. దీంతో ఇక ఆ జిల్లా ఏర్పాటు అవకాశం లేదని గిరిజనం ఆశలు వదులుకున్న తరుణంలో పోలవరం గోదావరి ముంపు గ్రామాలకు వెళ్లిన చంద్రబాబు అక్కడ జనానికి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చేశారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో ఈ హామీపై సానుకూల స్పందన వచ్చింది. అయితే చంద్రబాబు హామీ వెనుక మరో బలమైన కారణం ఉంది.
జగన్ లీకును పట్టేసిన చంద్రబాబు ?
పోలవరంతో పాటు రంపచోడవరం నియోజకవర్గాల్ని కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామనే లీకు ఇచ్చిన జగన్ దానిపై ముందుకెళ్లే విషయంలో మాత్రం చొరవ చూపలేదు. కానీ ఇప్పుడు కనివినీ ఎరుగని రీతిలో వచ్చిన గోదావరి వరదలతో అక్కడి ముంపు గ్రామాల ప్రజలకు జిల్లా కేంద్రం దూరం కావడం శాపంగా మారింది. దీంతో తమకు దగ్గర్లోని తెలంగాణ జిల్లా భద్రాచలంలో తమను కలపాలనే డిమాండ్లు లేవనెత్తారు. దీన్ని గ్రహించడంలోనూ జగన్ విఫలమయ్యారు. దీంతో అదే విషయాన్ని పట్టేసిన చంద్రబాబు... అక్కడికి వెళ్లి పోలవరం జిల్లా ఏర్పాటు చేసి జిల్లా కేంద్రమిస్తానని హామీ ఇచ్చి వచ్చారు. దీంతో జగన్ పై కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది.