సర్దుకుపోండి, ఫోన్లు ఇస్తాం: బాబు, అలా చూడండి: మోడీకి 'రద్దు' సూచన చేసిన వ్యక్తి
నోట్ల రద్దు వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తాత్కాలికమేనని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
విజయవాడ: నోట్ల రద్దు వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తాత్కాలికమేనని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్య పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టిందన్నారు.
నగదురహిత లావాదేవీల్లో దేశానికే తమ రాష్ట్రం ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. నగదురహిత లావాదేవీలు, జన్ ధన్ ఖాతాలు, రూపే లావాదేవీలు, మొత్తం వ్యయాలను పర్యవేక్షించడానికి నాలుగు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
నగదు రద్దుతో తలెత్తిన ఇబ్బందులు ఇన్ని రోజులవుతున్నా ఇంకా కనిపించడం దురదృష్టకరమన్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పెద్ద పెద్ద క్యూల్లో ప్రజలు ఓపిగ్గా నిరీక్షిస్తున్నారన్నారు. క్యూలో ఓపికగా నిలుచుంటున్న వారిని ఆయన ప్రశంసించారు.
నోట్ల రద్దు, అసలు విషయం చెప్పిన మోడీ!: మన్ కీ బాత్లో ఏమన్నారంటే..
దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుత నగదు సంక్షోభాన్ని కొంతకాలం పాటు సవాల్గా తీసుకొని సర్దుకుపోవాలన్నారు. ఆన్లైన్ లావాదేవీలు, డెబిట్, క్రెడిట్ రూపే కార్డులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఇబ్బందులను తగ్గించుకోవచ్చన్నారు.
19వేల ఈ పోస్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇందులో విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలకు పాత్ర కల్పించామన్నారు. ఏపీ పర్స్ పేరుతో ఒక మొబైల్ యాప్ను కూడా ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. నగదు రహిత లావాదేవీలను చేసుకోవడానికి వీలుగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఉచితంగా మొబైల్ ఫోన్లను పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.
జాగ్రత్తలు తీసుకోలేదు కానీ: అనిల్ బొకెల్
నోట్ల రద్దు అమలు విషయంలో ప్రభుత్వం సరైన ముందు జాగ్రత్తలు తీసుకోలేదని అర్ధక్రాంతి స్థాపకులు అనిల్ బొకిల్ అన్నారు. అయితే, ప్రభుత్వం నిర్ణయాన్ని సానుకూల దృక్పథంతో చూడాలని సూచించారు. రూ.50, అంతకన్నా తక్కువ విలువ కలిగిన నోట్లే అందుబాటులో ఉండాలన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు వాడకంలోకి వస్తుందని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు.
సమాజంలోని అట్టడుగు వర్గాలకు లాభం కలుగుతుందని, నోట్ల రద్దు కారణంగా ప్రజలు చనిపోతున్నారని కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారని, మరి ఈ విప్లవం వల్ల బాగుపడబోతున్న రైతులు, ప్రజల సంగతేమిటని ప్రశ్నించారు. పరిస్థితుల గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సదుద్దేశంతో చూడాలన్నారు.