అక్కడంతా మధ్యవయస్కులే, ఇక మన యూత్దే: బాబు
విజయవాడ: భారతదేశంోబ 2020 నాటికి 29 ఏళ్ల యువకులు ఉండబోతున్నారని, అప్పటికే చైనా, జపాన్, ఐరోపా దేశాల్లో 40 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఉండబోతున్నారని, దాంతో ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి రాబోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కొన్ని సేవలు అవసరమని, వాటికి సంబంధించిన యాప్స్ తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యాప్స్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరి ఫ్యాషన్ కావాలని, సృజనాత్మకంగా ఆలోచిస్తూ విజన్ను తయారు చేసుకోవాలని సూచించారు. మంచి యాప్లు తయారు చేసిన వారికి ప్రత్యేక బహుమతులు ఇస్తామని చెప్పారు. వాటిని తామే కొంటామని, ప్రపంచంలో ఏది కావాలన్నా ఆన్లైన్లో పెడతామని అన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రభు త్వ, ప్రైవేటు కళాశాలన్నింటిలో 1 గిగాబైట్ నుంచి 2 గిగా బైట్ల వరకు వైఫై సౌకర్యాన్ని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి రాబోతోందని చంద్రబాబు స్పష్టం చేశారు. మన పిల్లల తెలివితేటలు అద్భుతమని, వాళ్లు ఎక్కడైనా రాణిస్తారని చెప్పారు. ఒకప్పుడు ఎంత తెలివి ఉన్నా అదే జీతమని, ఇప్పుడు తెలివిని బట్టి జీతాలు వస్తున్నాయని వివరించారు. భవిష్యత్తు అంతా నాలెడ్జ్(జ్ఞానం)పైనే ఆధారపడి ఉండబోతోందని, దానిని అందరూ సాధించాలని అన్నారు.
విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వాటిని ఆన్లైన్లో ప్రారంభించారు. వాటితో పాటు యాప్ డెవలప్మెంట్ ప్రోగామ్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 17 ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
‘నా ఆశ.. ఆకాంక్ష మీరే. ప్రపంచంలోనే నాలెడ్జ్కు, విద్యకు ఆంధ్రప్రదేశ్ హబ్గా ఉండాలి. మీరు ఉద్యోగాల కోసం వెళ్లడం కాదు. మీరే ఉద్యోగాలు కల్పించే స్థితికి రావాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుం బం నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఒక ఐటీ నిపుణుడు తయారుకావాలి. లెర్న్(నేర్చుకోవడం), ఎర్న్(సంపాదించడం), ప్రోపగేషన్(వ్యాప్తిచేయడం, పెంపొందించడటం)ను ప్రతి ఒక్కరూ అవలంభించాలి. నాలెడ్జ్కు పెద్దపీట వేయాలనే రాష్ట్రవ్యాప్తంగా 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించాం. ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, యాప్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి' అని ఆయన అన్నారు.
ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తామని, స్టూడెంట్ డ్రివెన్(విద్యార్థులు కోరిన) విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఏదైనా సాధ్యమేనని, సాధారణ వ్యక్తిగా ఉన్న నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయి, దేశ ప్రతిష్ఠను పెంచుతున్నారని బాబు చెప్పారు. 2022 నాటికి దేశంలోని మొదటి మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావాలని, 2030 నాటికి దేశంలోనే నెంబర్ వన్ కావాలని, 2050 నాటికి ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.