తిరుపతి నా కోరిక: రాజధానిపై బాబు, హైద్రాబాద్ పేరు..
హైదరాబాద్: రాజధాని పైన ఏపీ సీఎం చంద్రబాబు గురువారం శాసన సభలో ప్రకటన చేశారు. అనంతరం ఆయన సభలో మాట్లాడారు. అందరిలాగే తనకు కూడా తిరుపతిలో రాజధానిని పెట్టాలని కోరికగా ఉండేదన్నారు. ఎవరి ప్రాంతంలో రాజధానిని పెట్టాలని వారికి కోరికగా ఉండటం సహజమే అన్నారు. అయితే, ప్రజలు తనను తన స్వార్థం కోసం గెలిపించలేదన్నారు.
తిరుపతిలో రాజధానిని పెడితే తన ఇంటిముందే ఉంటుందన్నారు. కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి తాను సచివాలయంలో పని చేసుకొని వచ్చేలా ఉండేదన్నారు. కానీ తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేశానని, అందుకే విజయవాడను రాజధానిగా ఎంచుకున్నామన్నారు. ఎవరి జిల్లాలో వారు రాజధాని ఉండాలని కోరుకోవడం సహజమే అన్నారు.

విజయవాడ ప్రాంతంలో ఎవరు కూడా రియల్ ఎస్టేట్కు సహకరించే ప్రసక్తి లేదన్నారు. ప్రజలకు కష్టం కలగకుండా తాను నాడు హైదరాబాదును అభివృద్ధి చేశానని చెప్పారు. నాడు హైదరాబాదును అభివృద్ధి చేసి.. తర్వాత మిగతా ప్రాంతానికి వెళ్దామనుకున్నానని, అంతలోనే ఎన్నికలు వచ్చి ఓడిపోయామన్నారు. తన పాలన వల్లనే తెలంగాణకు నేడు మిగులు బడ్జెట్ వచ్చిందన్నారు. రాజధాని విషయంలో కాంగ్రెసు పార్టీ ట్రాప్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పడవద్దని చంద్రబాబు అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశముంటే ఇడుపులపాయలో రాజధానిని పెట్టేవారేమోనని ఎద్దేవా చేశారు. ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి పెట్టడం తమకు అభ్యంతరం కాదని, హెడ్ ఆఫీస్ పెట్టడాన్ని తాను ప్రశ్నించానని చెప్పారు. పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం రాజధాని పైన నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వానికి ఖర్చు తగ్గించి మంచి నగరాన్ని నిర్మించడమే తమ ఉద్దేశ్యమన్నారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నారు. ల్యాండ్ పూలింగ్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఈ రాష్ట్రంలో ఐదేళ్లలో ఏ గ్రామానికి నీటి కొరత లేకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ తమ లక్ష్యమన్నారు. కట్టెల పొయ్యి పైన వంట వద్దని తాను గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. ఐదేళ్లలో గ్రామాల్లో నీటి సమస్యను తీర్చుతామన్నారు. ప్రతి ఒక్క ఇంటికి ఎల్పీజీ గ్యాస్ ఇస్తామన్నారు. గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు గ్యాస్ ఇస్తామన్నారు. ఏ పని చేసినా పేదవాళ్లను దృష్టిలో పెట్టుకొని చేస్తామన్నారు. పేదరికం లేని సమాజమే తమ సిద్ధాంతమన్నారు.
ప్రతి ఒక్క ఇంటికి ఆప్టివ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ఇప్పిస్తామన్నారు. దేశంలో మోడీ అభివృద్ధి బాటలో వెళ్తున్నారని, కేంద్రం సహకారం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications