అరిస్తే భయపడబోను, నేనూ మనిషినే కాదా: చంద్రబాబు వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రతిపక్ష సభ్యులు అరిస్తే తాను భయపడబోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాను మనిషినే అని, ప్రతిపక్ష సభ్యులు తిట్టిన తిట్లూ వారి అసభ్య ప్రవర్తన తనను చాలా బాధపెట్టిందని, అయినా ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వహిస్తున్నానని ఆయన అన్నారు. ప్రతిపక్ష సభ్యురాలు రోజాను సస్పెండ్ చేసిన తర్వాత శుక్రవారం సాయంత్రం కాల్ మనీపై తన ప్రకటనను కొనసాగిస్తూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
కాల్ మనీ వ్యవహారంలో అన్ని పార్టీల వాళ్లున్నారని ఆయన అన్నారు. కాల్ మనీ వ్వవహారంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని, చండశాసనుడిగా వ్యవహరిస్తానని ఆయన చెప్పారు. కాల్ మనీకి సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేకమైన కోర్టు పెడుదామని, నిర్భయ చట్టాన్ని అమలు చేద్దామని ఆయన చెప్పారు. దోషులను శిక్షించడానకి తిగిన సూచలను ఇస్తే స్వీకరించి అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
కాల్ మనీ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తగిన చర్యలు తీసుకుంటామని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. కాల్ మనీ, వడ్డీవ్యాపారంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. తాను 227 మంది పేర్లు చెప్పానని, ప్రతిపక్ష సభ్యుల వద్ద పేర్లు ఉంటే చెప్పాలని ఆయన అన్నారు. ఎందుకు భయపడుతున్నారని ఆయన అడిగారు.
కొత్త రాజధాని అమరావతి అని, సవాలక్ష సమస్యలున్నాయని, రాజధానికి చెడ్డపేరు రావాలని, బయటివారిని భయబ్రాంతాలను చేయాలని ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆయన అనమ్నారు. తరతమ భేదం లేకుండా కాల్ మనీ వ్యవహారంలో నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. చట్టప్రకారం ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
తమ ఎమ్మెల్సీ పేరు వస్తే ఆయన సోదరుడిని పోలీసులు అరెస్టు చేయించామని, అది తమ ప్రభుత్వమని చంద్రబాబు అన్నారు. నేరాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాల్ మనీ వ్యవహారంలో ఉన్నవారు పైకి ఎదగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.