టీడీపీ క్యాడర్ లో కిక్కు- జగన్ చుట్టూ అన్నలేరీ- అనంత టూర్ లో చంద్రబాబు కామెంట్స్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరు ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో మరో మలుపు తీసుకుంది. మూడేళ్లుగా వైసీపీ సర్కార్ పై పలు రకాలుగా పోరాడుతున్న విపక్ష నేత చంద్రబాబు.. ఇప్పుడు జిల్లాల పర్యటనల రూపంలో మరోసారి పార్టీ క్యాడర్ కు దగ్గరయ్యే్ందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రజా వ్యతిరేకతతో టీడీపీ క్యాడర్ లో కిక్కు కనిపిస్తోందని ఆయన అనంతపురం పార్టీ నేతల భేటీలో వ్యాఖ్యానించారు.
అనంతలో చంద్రబాబు
రాయలసీమలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో ఆయన పార్టీ నేతలతో భేటీ అయ్యారు. టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరోసారి పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇవాళ వారిలో ఉత్సాహం నింపేందుకు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ప్రజా వ్యతిరేకతతో క్యాడర్ లో కిక్కు
ఎన్టీఆర్ హయాం నుంచి అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉందని చంద్రబాబు ఇవాళ పార్టీ కార్యకర్తల భేటీలో వ్యాఖ్యానించారు. 2014లో 14 సీట్లకు గాను 12 సీట్లు గెలిపించిన జిల్లా అనంతపురమని, రాష్ట్రంలో ప్రభుత్వ బాదుడు భయంకరంగా ఉందని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలు ఒక్క అడుగు వేస్తే...ప్రజలు పది అడుగులు వేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత చూసి క్యాడర్ కు కిక్కు ఎక్కిందన్నారు.
మూడేళ్లలో పరిశ్రమలేవీ ?
అనంతపురానికి కియా పరిశ్రమ వస్తుంది అని ఎవరైనా ఊహించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 30 వేల మందికి ఉపాధి కియా ద్వారా వస్తుందని ఆయన అన్నారు. ఈ మూడేళ్లలో ఒక్క పరిశ్రమ వచ్చిందా అని కార్యకర్తల్ని అడిగారు.
జిల్లాలో జాకీ పరిశ్రమ వైసిపి రౌడీ ఇజానికి భయపడి పారిపోయిందని, జగన్ ముద్దులు చూసి అనంత ప్రజలు కూడా మోస పోయారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా జగన్ పాలన అంతా బాదుడు..గుద్దుడు ఉందన్నారు. సొంత జేబులు నింపుకోవడానికి జగన్ జె బ్రాండ్స్ మద్యం తీసుకు వచ్చారని తెలిపారు.
జగన్ చెప్పిన అన్నలంతా ఏరీ ?
జగన్ చెప్పిన సుబ్రహ్మణ్యం అన్న, సవాంగ్ అన్న ఏమయ్యారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుబ్రహ్మణ్యం ను చివరికి కుర్చీలేని పోస్టుకు పంపారని, మనపై కేసులు పెట్టి వేధించిన డిజిపి సవాంగ్ చివరికి ఏమయ్యారని కార్యకర్తల్ని ప్రశ్నించారు. అనంతకు మూడేళ్లలో ఏం చేశారో చర్చకు సిద్దమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కర్నూలులో సోలార్ ప్రాజెక్టుపై విమర్శలు చేసి, సిగ్గు లేకుండా ఇప్పుడు ప్రారంభించారని జగన్ సర్కార్ ను ఆక్షేపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిని అనంత ప్రజలు వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. గంజాయికి అలవాటు పడి యువత పక్కదోవ పడుతుందని, దద్దమ్మ సిఎం గంజాయి సరఫరాను అరికట్టకపోవడం వల్లనే ఇప్పుడు ఇన్ని అనర్థాలని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు జరిగిన భూ కబ్జాలపై అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేసి చర్యలు చేపడతామన్నారు.