నీకిక్కడేం పని అని కెసిఆర్ అంటారా, పవన్ కళ్యాణ్ ఏమన్నారు: చంద్రబాబు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తనకు లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నీకిక్కడేం పని అని తనను నిన్న గాక మొన్న కెసిఆర్ అన్నారని, హైదరాబాద్ పదేళ్ల పాటు రాజధాని అని అనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. అయినా తాను హైదరాబాదులో ఉండడం లేదని, నాలుగు రోజులు ఎపిలో తిరుగుతున్నానని ఆయన అన్నారు.
ఇరు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూర్చుని మాట్లాడడానికి తానెప్పుడూ సిద్ధమేనని పునరుద్ఘాటించారు. గోదావరి పుష్కరాలకు కేసీఆర్ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఆహ్వానిస్తానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజనకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సెక్షన్ 8పైనా ఆయనతో మాట్లాడానని, విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాజ్నాథ్పైనే ఉందని చెప్పారు.
జపాన్లో ఐదు రోజులపాటు పర్యటించి వచ్చిన చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్ర హోంశాఖ రూపొందించిందని, నోడల్ మంత్రిత్వ శాఖ అదేనని, రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలున్నాయని కేంద్రానికి సంబంధించిన మరికొన్ని సమస్యలు ఉన్నాయని కేంద్రం అమలు చేయాల్సిన మరికొన్ని చట్టాలు ఉన్నాయని ఆయన అన్నారు.
ఈ అన్ని అంశాలపైనా రాజ్నాథ్ సాధ్యమైనంత తొందరలో నిర్ణయం తీసుకోవాలని, ఇందుకు రాజ్నాథ్ ఒక సమావేశాన్ని నిర్వహించాలని, దాని ద్వారా సానుకూల పరిష్కారాన్ని సాధించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. గవర్నర్ను మార్చడం సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు.
గవర్నర్ను బదిలీ చేయాలని కోరారా అని ప్రశ్నించగా, ఆ విషయం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలే గవర్నర్ను విమర్శించడంపై మాట్లాడుతూ ఎవరి వాదన వారికుంటుందని, అయితే ఈ విషయంలో సంయమనం పాటించడం అవసరమని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలపై కూడా కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని, చట్టంలో ఉన్నట్లు అమలు చేయాలని, దీనిపై కేంద్ర మంత్రి సమక్షంలో మాట్లాడుకునే అవకాశం ఉందని చెప్పారు.
నిజానికి ఆధునీకరణ ద్వారా కృష్ణా జలాలను ఆదా చేసి బీమా ప్రాజెక్టును నిర్మించింది తానేనని, కల్వకుర్తి, కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్టులను తానే ప్రారంభించానని గుర్తు చేశారు. ఏదో విధంగా నిందించాలని చూడకుండా కలిసికట్టుగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చంద్రబాబు ప్రతిస్పందించారు. ‘మీరు అడగకపోయినా నా అంతట నేను చెబుతున్నాను. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు' అని ఆయన అన్నారు. సమస్యలు పరిష్కారం కావడంపై దృష్టి కేంద్రీకరించకుండా జఠిలం చేసుకోవడానికి ఒక్క నిమిషం పట్టదని ఇలాంటి సమయంలో అంతా సంయమనం పాటించాలని ఆయన అన్నారు.
‘మనది కొత్త రాష్ట్రం. రాజధాని లేదు. సమస్యలున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. పెట్టుబడులు రావాల్సి ఉంది. ఇవన్నీ ఒక్క రాత్రిలో పరిష్కారం కావు. అందరి సహకారం తీసుకుని కష్టపడి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమస్యల నుంచి బయటపడేందుకు చూడాలి' అని చంద్రబాబు అన్నారు. తన ఎజెండా కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం.. రాజధానిని అద్భుతంగా నిర్మించడమని, దీనిని తాను యజ్ఞంలా చేస్తుంటే, కొందరు రాక్షసులు భగ్నం చేయాలని చూస్తున్నారంటూ వైసీపీ, కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ సహనం వహించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications