ఎన్టీఆర్ విగ్రహానికి శక్తి, తలుచుకుంటే చాలు: బాబు
ఏలూరు/ హైదరాబాద్: ఎన్టీఆర్ విగ్రహానికి ఒక శక్తి ఉందని, తిరుమలలోని వేంకటేశ్వరస్వామికి మొక్కుకుంటే, ఆయన దీవిస్తే మీ కష్టాలు ఎలా తీరతాయో ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలచుకుని, ఆయన విగ్రహాన్ని ఒక్కసారి చూసుకుని ఏ సంకల్పం చేసినా, అది జయప్రదం అవుతుందని, దానికి ఢోకానే ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఎన్టీఆర్ ఒక ఆదర్శమని, ఈ తరాలకే కాకుంమా భావి తరాలకు కూడా ఒక ఆదర్శమని, వేంకటేశ్వరస్వామి ఎలా ఉంటాడో తెలియదు కానీ, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుడిని చూసుకునే సంస్కృతి వచ్చిందని, ఎన్టీఆర్ దేవుడితో సమానమని ఆయన అన్నారు. తెలుగు వారి గుండెల్లోంచి ఎన్టీఆర్ను ఎవరూ తొలగించలేరని, ఎన్టీఆర్ రికార్డును ఎన్టీఆర్ తిరిగి పుడితేనే బ్రేక్ చేయగలరని, అంతేతప్ప మరెవరూ చేయలేరని చాగల్లులో జరిగిన సభలో చెప్పారు.
మనం ఎక్కడైనా పని చేయవచ్చు, ఎంత పెద్ద హోదాలో అయినా ఉండొచ్చు గానీ మన ఊరుని మాత్రం మరిచి పోకూదని, దాతల రూపంలో జన్మభూమి రుణం తీర్చుకోవాలని, ఏపీని స్మార్ట్గా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కలిసి రావాలతీచంద్రబాబు పిలుపునిచ్చారు. స్మార్ట్ విలేజ్ ప్రాధాన్యాన్ని వివరించారు. సమాజమే దేవాలయమన్న ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ‘స్మార్ట్ ఏపీని' తీర్చిదిద్దుదామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ పయనమయ్యారు. తెల్లవారుజామున 4.10గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఎమిరేట్స్ విమానంలో బయల్దేరి దుబాయ్కు అక్కడి నుంచి జ్యూరిచ్ చేరుకుంటారు. మూడు రోజుల పాటు దావోస్లో పర్యటించనున్న ఆయన ‘పట్టణాభివృద్ధి భవితవ్యం'' అనే అంశంపై జరిగే సమావేశంలో ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు.
పలు దేశాల అధినేతలు, సీఈఓలు పాల్గొనే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్ లక్ష్యాలు, తన విజన్ గురించి వివరించి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. దావోస్ వెళ్తున్న బృందంలో సీఎంతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో ఏపీ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు అజయ్జైన్, ఎస్ఎస్ రావత్, సీఎం ఓఎస్డీ వెంకయ్యచౌదరి, సీఎం పీఏ రాజగోపాల్ ఉన్నారు.