హైదరాబాద్లో అలా, ఇక్కడ ఇలా.. వర్షాల నష్టం తగ్గించాం: చంద్రబాబు
విజయవాడ: భారీ వర్షాల ప్రభావం రాష్ట్రంలోని మూడు జిల్లాలు దెబ్బ తిన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చందర్బాబు నాయుడు చెప్పారు. అతి కొద్ది సమయంలో ఎక్కువ వర్షపాతం పడిందని, అయినా నష్టం తగ్గించగలిగామని ఆయన చెప్పారు. గతంలో హైదరాబాద్లో 20 సెంటీమీటర్ల వర్షం పడితేనే వరదలు ముంచెత్తి తీవ్ర నష్టం జరిగిందని, ఇప్పుడు 30 సెంటీమీటర్ల వర్షపాతం పడినా ముందు జాగ్రత్త చర్యల వల్ల నష్టం తగ్గించగలిగామని ఆయన చెప్పారు.
వర్షపు తాకిడి ప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. కడప జిల్లాలోని నాలుగు మండలాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయిందని, 24 గంటల్లో పునరుద్ధరించాలని ఆదేశించామని ఆయన చెప్పారు. విపత్తులం ఆపలేం గానీ ప్రజలను ఆదుకోవడంలో తాము ముందంజలో ఉన్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు తనకున్న సమాచారం ప్రకారం వర్షాల వల్ల ఆరుగురు మరణించారని ఆయన చెప్పారు.
కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలకు జరిగిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలను ఆయన చెప్పారు. పంట, పశు నష్టం జరిగిందని, రోడ్లు తెగిపోయాయని, చెరువులకు గండ్లు పడ్డాయని, విద్యుత్తు స్తంభాలు పడిపోయాయని ఆయన చెప్పారు. దెబ్బ తిన్న ఇళ్ల వివరాలను కూడా ఆయన చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల భారీగా నష్టం తగ్గించగలిగామన చెప్పారు.
పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాలో 409 హెక్టార్ల పంట నష్టం జరిగిందని ఆయన చెప్పారు. ఇది అల్పపీడనం మాత్రమేనని, తుఫాను అయితే నష్టం ఎక్కువగా ఉండేదని ఆయన చెప్పారు. మానవతా దృక్పథంతో ప్రజలను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తాత్కాలికంగా ఏం చేయాలో అదంతా చేశామని ఆయన చెప్పారు.
ఎప్పుడు పడనంత వర్షం తిరుమలలో పడిందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా పోయిందని, అయితే భవిష్యత్తులో సంభవించే ప్రమాదాలను పసిగట్టి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
కంట్రోల్ రూమ్ నెంబర్ - 040 23456005