నాది అనుభవం; పవన్ ది పవర్: అగ్నికి వాయువు తోడైనట్టు ప్రజాగళానికి వారాహి తోడు!!
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో టిడిపి అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తణుకులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగ సభను నిర్వహించిన చంద్రబాబు జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడ్డాయని తణుకు వేదికగా స్పష్టం చేశారు.
ఓట్లు చీలకూదడనే పవన్ కళ్యాణ్ కృషి
వైసిపి అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారని పేర్కొన్న చంద్రబాబు చీకటి పాలనను అంతం చేసేందుకు, ఓట్లు చీలకూడదు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఎంతో విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ సహాయం అవసరమని అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్
సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. నాకు అనుభవం ఉందని పేర్కొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందని వ్యాఖ్యలు చేశారు. అగ్నికి వాయువు తోడైనట్లు ప్రజా గళానికి వారాహి తోడైందని చంద్రబాబు అన్నారు. అది జగన్ అహంకారాన్ని బూడిద చేస్తుందన్నారు.
సైకిల్ స్పీడుకు తిరుగు లేదు.. గ్లాస్ జోరుకు ఎదురు లేదు
సమస్యలు పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సైకిల్ స్పీడుకు తిరుగులేదని.. గ్లాస్ జోరుకు ఎదురులేదని వచ్చే ఎన్నికలలో వైసిపి కొట్టుకుపోవడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతాడు అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

మీకెలాంటి పాలన కావాలో తేల్చుకోండి
విధ్వంసకర పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా? అన్నది ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. రైతును రాజుగా చేసే బాధ్యత తనదన్నారు. రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని పౌరసరఫరాల శాఖ మంత్రి తణుకులో ఉన్నారని చంద్రబాబు వైసిపి మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వస్తే తోలి సంతకం దీనిపైనే
అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ పైన చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఉపాధి కల్పన పై శ్రద్ధ పెడతామని, వాలంటీర్లను చెడగొట్టాలని జగన్ చూస్తున్నారని, మీ ఉద్యోగాలకు నాది భరోసా అన్నారు. వాలంటీర్ల జీతం అయిదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications