మట్టి తెస్తే ఉద్వేగానికి గురైన బాబుకు ఆ విషయంపై బాధ కలగలేదా: బొత్స
హైదరాబాద్: అమరావతికి పార్లమెంటు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మట్టి తెస్తే ఉద్వేగానికి గురైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించకపోతే బాధ కలగలేదా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ఇంకా తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం ద్వారా ప్రధాని నిరాశ పరిచారని ఆయన అన్నారు. పార్లమెంటు ఇచ్చిన హామీలకు విలువ లేదా అని ఆయన అడిగారు. చంద్రబాబు తీరుతో సొంత పార్టీ నేతలో అసంతృప్తికి గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేయడానికి చంద్రబాబు ఇకనైనా ముందుకు రావాలని బొత్స అన్నారు.

చంద్రబాబు ప్రధానికి పంపిన నివేదికలో ఏముందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పంపించిన నివేదికలో ప్రత్యేక హోదా అంశం ఉందో లేదో ప్రధాని కార్యాలయం నుంచి వివరణ ఇప్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. శనివారంనాడు ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
ప్రధాని రాష్ట్రానికి వచ్చే ముందు రాష్ట్రం ఏం కోరుకుంటుందో ముందే వివరణ అడుగుతారని ఆయన చెప్పారు. ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధానిని ప్రత్యేక హోదా అడుగబోయి తడబాటుతో ప్రత్యేక ప్యాకేజీ అడిగానంటూ చంద్రబాబు చెప్పారని, చంద్రబాబు ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
మోసపూరిత మాటలతో చంద్రబాబు ఎన్నాళ్లు ప్రజలను ఇబ్బంది పెడుతారని ఆయన అడిగారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం లాలూచీ పడకుండా ఇప్పటికైనా చేసిన తప్పును అంగీకరించి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, లేకపోతే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications