'చంద్రబాబుది అంతా బిల్డప్.. అక్రమార్జనను దాచుకోవడానికే విదేశీ టూర్స్'
విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం, వాటి ద్వారా వచ్చిన పెట్టుబడుల గురించి వెల్లడించాలని అంబటి పేర్కొన్నారు.
గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి దావోస్ పర్యటనను వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రూ.3లక్షల 22వేల డాలర్ల డబ్బులు చెల్లించి చంద్రబాబు దావోస్ ఆహ్వానం పొందారని, కానీ ఇదంతా కప్పి పుచ్చుకుని వారే ఆహ్వానం పంపించినట్టుగా పైకి మాత్రం బిల్డప్ ఇస్తున్నారని అంబటి అన్నారు.
అక్రమంగా పోగేసుకున్న సంపదను దాచుకునేందుకే చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు చంద్రబాబు పర్యటనపై ఇలా స్పందించారు. ఇప్పటిదాకా 16సార్లు విదేశాలకు వెళ్లిన చంద్రబాబు వాటి ద్వారా సాధించిందేంటో చెప్పాలని ప్రశ్నించారు.
సింగపూర్, మలేషియా తరహా రాజధాని అని ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు సినీ దర్శకుల గురించి మాట్లాడుతున్నారని అంబటి విరుచుకుపడ్డారు. విదేశీ పర్యటనలకు చంద్రబాబు ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు రహస్య పర్యటనల వివరాలన్నింటిని వెల్లడించాలని అన్నారు.
విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం, వాటి ద్వారా వచ్చిన పెట్టుబడుల గురించి వెల్లడించాలని అంబటి పేర్కొన్నారు. లేదంటే, చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారనే భావన జనాలకు కలుగుతుందన్నారు.
చంద్రబాబు చెప్పే ఆస్తుల లెక్కలన్ని వట్టి బోగస్ అని, హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇల్లే కోట్ల విలువ చేస్తుందని అన్నారు.వాస్తవాలకు మసిపూయడం చంద్రబాబుకు అలవాటైన విద్య అని విమర్శించారు.