చంద్రబాబు విరుద్ద ప్రకటనలు...ప్రజలకు నిజాలు చెప్పండి:ఐవైఆర్ కృష్ణారావు
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని రోజులుగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. బిజెపి పొత్తుతో లాభం జరిగిందని నాలుగేళ్లు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు నష్టపోయామని చెబుతున్నారని ఐవైఆర్ గుర్తుచేశారు.
అభివృద్దిపై చంద్రబాబు చెబుతున్నదంతా అబద్దమన్న ఐవైఆర్ ఎపి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని స్పష్టం చేశారు. ఎపి అభివృద్దిలో లోపాల గురించి తాను రాసిన "ఎవరి రాజధాని అమరావతి" పుస్తకంలో ప్రస్తావించిన అంశాలకు తాను కట్టుబడి ఉన్నానని ఐవైఆర్ స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని వాస్తవాలు వెల్లడిస్తానని, మరో పుస్తకం విడుదల చేయాలనుకుంటున్నానని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.
ఎపి మాజీ ఛీఫ్ సెక్రటరీ అయిన ఐవైఆర్ కృష్ణారావు ఇటీవలే "ఎవరి రాజధాని అమరావతి" పేరుతో పుస్తకం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 112 పేజీల ఆ పుస్తకం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. ఉన్నదున్నట్టు వాస్తవాలు, రాజధాని ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలు తాను కూలంకషంగా అందులో చర్చించినట్లు ఐవైఆర్ చెబుతున్నారు.
అలాగే రాజధాని ఎంపికలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమి ఉందో.. ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో...ప్రస్తుతం ఆ ప్రాంతం ఎలా ఉందో.. భవిష్యత్లో ఎలా తయారవుతుందో తదితర విషయాలు ఐవైఆర్ తనదైన కోణంలో అందులో ప్రస్తావించారు. అలాగే టిడిపి ప్రభుత్వంలోని పలువురిపై ఆ పుస్తకంలో ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది.