తుగ్లక్ అంటుంటే జగన్ తట్టుకోలేకపోతున్నాడు.. ఉక్రోషంతోనే బాలయ్యపై దాడి: సీఎంపై చంద్రబాబు ఫైర్
సీఎం జగన్ తీరు, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల వ్యవహారశైలిపై ప్రతిపక్షనేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 12 చార్జిషీట్లలో నిందితుడిగా ఉన్న జగన్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మోసాలు మానలేదని, తెలివితక్కువతనంతో ఉన్న కంపెనీలనూ పారిపోయేలా చేస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మరోసారి సోషల్ మీడియా వేదికగా బాబు విమర్శలబాణాలు వదిలారు. ఉదయం కూడా ఆయన ట్విటర్ ద్వారానే నిప్పులు చెరిగారు.
ఏమిటివన్నీ?
ప్రతిఒక్కరూ తుగ్లక్ తుగ్లక్ అంటుంటే సీఎం జగన్ తట్టుకోలేకపోతున్నారని, ఉక్రోషం పట్టలేకే హిందూపూర్ లో టీడీపీ బాలకృష్ణ, వైజాగ్ లో టీడీపీ ఆఫీసుపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘ప్రశాంతంగా ఉండే విశాఖ నగరంలో రౌడీలు కాగడాలతో తిరగడమా? ఎక్కడపడితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల్ని అడ్డుకోవడమా? ఏమిటివన్నీ? వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం''అని చంద్రబాబు రాసుకొచ్చారు. భూముల కబ్జాకే విశాఖను రాజధానిగా చేస్తున్నారని ఆరోపించారు.
అంతా తెల్సిపోయింది..
సీఎం కాకముందు, అయిన తర్వాత కూడా జగన్ కు అవినీతి అలవాటుగా ఉందని, ఆయన చేతకానితనం, తెలివితక్కువతనం దేశం మొత్తానికి తెల్సిపోంయిదని చంద్రబాబు విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు జగన్ సర్కారు మాత్రం అధికార వికేంద్రీకరణ పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేసిందని బాబు ఫైరయ్యారు.
రాష్ట్రద్రోహులు..
బాలయ్యను వైసీపీ కార్యకర్తలు సీమద్రోహి అనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. తాను ఏపీకి తీసుకొచ్చిన పరిశ్రమల్లో కియా కార్ల పరిశ్రమ.. దేశంలోనే అతి పెద్ద ఫారిన్ డైరరెక్ట్ ఇన్వెస్ట్మెంట్(ఎఫ్డీఐ) అని, గార్మెంట్ ఇండస్ట్రీస్ తోపాటు సోలార్, వింగ్ పవర్ ప్లాంట్ల ద్వారా రాయలసీమలో ఎంతోమందికి ఉపాధి క కల్పించామని గుర్తుచేశారు. ‘‘సీమకు ఇన్ని మేళ్లుచేసిన మేము ద్రోహులమా? కియా యాక్సిలరీ యూనిట్లను ఏపీలో పెట్టనీయకుండా పుణెకు తరిమేసిన వైసీపీ వాళ్లు ద్రోహులా?'' అని ప్రశ్నించారు.