ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై చంద్రబాబు ఫైర్.. ఉద్యోగులపై సీఎం జగన్ పంజా విసిరారంటూ మండిపాటు
స్వతహాగా ఫ్యాక్షనిస్టయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పరిపాలనలోనూ ఫ్యాక్షనిస్టు ధోరణినే కనబరుస్తున్నారని.. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే పంజా విసురుతున్నారని ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే అన్నివర్గాల ప్రజలను అరిగోసపెట్టిన జగన్.. లేనిపోని కారణాలకు ఉద్యోగులపై కక్షసాధింపులకు దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో టీడీపీ చీఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏపీలో జరుగుతన్న పరిణామాలపై చంద్రబాబు ఏమన్నారంటే..

పీక్స్లో ఫ్యాక్షనిజం..
‘‘వైసీపీ సర్కారు ఫాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోంది. ఇన్నాళ్లూ ప్రతిపక్షాల నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలపై కక్షసాధింపులకు పాల్పడ్డా వాళ్ల ఉన్మాదం ఇంకా చల్లారలేదు. రైతులు, కూలీలు, మహిళలు, కార్మికులు, యువతను పీడించుకుతిన్నా ప్రభుత్వానికి తనివితీరలేందు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే సీఎం జగన్ పంజా విసిరారు.

లొంగదీసుకునే ప్రయత్నం..
అధికారులు ఎవరైనా మూడు నెలలకు మించి వెయిటింగ్ లో ఉంటే జీతాలు చెల్లించబోమని జగన్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వుల్ని టీడీపీ ఖండిస్తోంది. వైసీపీ తరహా కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. అధికారుల్ని భయభ్రాంతులకు గురిచేసి, లొంగదీసుకోడానికి చేసే ప్రయత్నమే ఈ జీవోలు. రాష్ట్రంలో వందలమంది అధికారులకు 8నెలలుగా పోస్టింగ్ లు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది. ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వబోమనడం చాలా దుర్మార్గం.

సర్కారు తప్పులకు ఉద్యోగుల్ని బలి చేస్తారా?
అధికారుల్ని అవసరమైనప్పుడు వాడుకుని, మళ్లీ వెయిటింగ్ లిస్టులో ఉంచే ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. వైసీపీ ప్రభుత్వం తప్పు చేసి, ఆ తప్పులకు ఉద్యోగులను బలిచేయడం దారుణం. ఇంతమంది అధికారుల్ని 8నెలలుగా వెయిటింగ్ లో ఉంచిన ప్రభుత్వం.. వాళ్ల పేర్లను రివ్యూకు ఎందుకు పంపలేదు? పోస్టింగులు ఇవ్వకుండా వెయిటిగ్ లో పెట్టేది మీరే... వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి జీతాలు ఇవ్వబోమని చెబుతున్నదీ మరే.. అసలు ఇదెక్కడి న్యాయం?''అని చంద్రబాబు ప్రశ్నించారు.

సస్పెన్షన్ తో ఏమీకాదన్న ఏబీ
తన సస్పెన్షన్ విషయంలో ఎవరూ కంగారు పడొద్దని, దీనిపై నిబంధనల ప్రకారం న్యాయపోరాటం చేస్తానని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం మీడియాతో అన్నారు. ఆయన అదనపు డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన సమయంలో.. నిబంధనలకు విరుద్దంగా ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు చేయడం, మరో ఏడు ఆరోపణలపై సస్పెండ్ చేస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.












Click it and Unblock the Notifications