ఓటీఎస్ వసూళ్లు: ఆ రిజిస్ట్రేషన్లు ఇల్లీగల్; జగన్ ప్రభుత్వంపై చీటింగ్ కేసులు పెట్టాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటీఎస్ రగడ కొనసాగుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ఇప్పటికే నిరుపేదలను డబ్బులు చెల్లించవద్దని చెప్తున్న చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఇళ్ళ హక్కు పత్రాలు ఇస్తామని వెల్లడించారు. వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో వైసీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రజలకు లబ్ధి జరగడంలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇళ్లకు ఓటిఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా అంటూ చంద్రబాబు జగన్ సర్కారును నిలదీశారు.
మా ఇళ్ళు మళ్ళీ మాకే ఇచ్చేదేంటయ్యా... ఓటీఎస్ స్కీమ్ పై జనాగ్రహం, అసలు జరుగుతుందిదే!!
జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు: చంద్రబాబు
మంగళగిరి టిడిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఓటిఎస్ పేరుతో వైసీపీ సర్కార్ బలవంతంగా వసూలు చేస్తున్నదని అసహనం వ్యక్తం చేశారు. బలవంతంగా వసూలు చేస్తూ స్వచ్ఛందమంటారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాట తప్పం మడమ తిప్పం అని చెప్పుకునే జగన్ చేస్తుంది ఏంటి ? చెప్పాలని నిలదీశారు. జగన్ కు మోసం చెయ్యటం అలవాటైంది అని ఎద్దేవా చేశారు. తప్పుడు కేసులు పెడితే ప్రజలు భయపడతారని అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు చంద్రబాబు.
భూమిచ్చారా? ఋణం ఇచ్చారా? మీపై 420 కేసులు పెట్టాలి
ఇళ్లకు సీఎం భూమి ఇచ్చారా? రుణం ఇచ్చారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేమిటని మండిపడ్డారు. కంపల్సరీ కాదంటూనే ఓ టి ఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా వసూలు చేస్తున్నారని విమర్శలు చేస్తే కేసులు పెడతారా అంటూ చంద్రబాబు నిలదీశారు. జగన్ సర్కార్ పైనే కేసులు పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీటింగ్ కేసులు, 420 కేసులు ఈ ప్రభుత్వం పైనే పెట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇప్పటికే జగన్ బయట తిరగలేకపోతున్నారు
ఇళ్ళ మీద ఉన్న రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారని పేర్కొన్న చంద్రబాబు ఇచ్చిన మాట జగన్ తప్పారని, మడమ తిప్పారని జగన్ పై ఫైర్ అయ్యారు. ఇప్పటికే జగన్ బయట తిరగలేక పోతున్నారని చెప్పిన చంద్రబాబు చాలా మంది పేద ప్రజలు వైద్యానికి దాచుకున్న సొమ్మును ఓ టి ఎస్ కోసం వసూలు చేసేస్తారా అంటూ నిలదీశారు. బొబ్బిలి లో ఓ టి ఎస్ బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్న చంద్రబాబు, ఆ బాలుడి వైద్యానికి అయ్యే ఖర్చును తెలుగుదేశం పార్టీ భరిస్తుందని వెల్లడించారు.
రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లో చెయ్యటం ఇల్లీగల్
పులిచింతల ప్రాజెక్టు కోసం భూములిచ్చిన ప్రజలు, పునరావాసంలో భాగంగా ఇళ్లు తీసుకున్నారని, ఆ పేదలపై కూడా ఓటిఎస్ అమలు చేస్తారా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్రామ సచివాలయం లో రిజిస్ట్రేషన్ కూడా ఇల్లీగల్ అని పేర్కొన్న చంద్రబాబు రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్ లే చెయ్యాలని, ఎవరు పడితే వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారో చెప్పాలని పేర్కొన్నారు . ఎవరు పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని తేల్చి చెప్పిన చంద్రబాబు, ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేసి, డాక్యుమెంట్లను వైసిపి రంగుల్లో ఇస్తారా అంటూ ధ్వజమెత్తారు.