అప్పులు.. తప్పులే.. పేదలకు ఉరితాడులా: వైసీపీ సర్కారుపై చంద్రబాబు ఫైర్
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో పౌరుల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని పేపర్లకే పరిమితమని మండిపడ్డారు. చంద్రబాబు సోమవారం మాట్లాడారు.
అప్పులు, తప్పులే.. : జగన్ సర్కారుపై చంద్రబాబు ఫైర్
రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్నీ రెండున్నరేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు చంద్రబాబు. సీఎం జగన్ పాలనంతా.. అప్పులు, తప్పులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు అని టీడీపీ అధినేత విమర్శించారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వైసీపీ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు.
మీడియాకు సంకెళ్లు?..: వైసీపీ సర్కారుకు చంద్రబాబు హెచ్చరిక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తోన్న మీడియాకు సంకెళ్లు ఇంకెన్నాళ్లు? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలు చెప్పినట్లు చేస్తూ సీఐడీ అధికారులు.. ఆ సంస్థ పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని మంటగలుపుతున్నారని మండిపడ్డారు. ఏపీలో మునుపెన్నడూ లేనివిధంగా మీడియా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి అణిచివేత చర్యల వల్ల జగన్ ఎంతటి నియంతో అర్థమవుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే వారు ఎవరూ లేరన్నారు. ప్రజాక్షేత్రంలో తప్పులకు శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.
పేదల మెడకు ఉరితాడులా ఓటీఎస్: చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పేదల మెడకు ఉరితాడులా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేగాక, ఉచిత రిజిస్ట్రేషన్లు కోరుతూ డిసెంబర్ 20, 23న నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కక్ష సాధింపు కోసమే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్పై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రేమచంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో చెల్లింపులు జరిగాయని ఆయన అన్నారు. ఏపీలో రైతులు ఆందోళన చెందుతున్నారని రైతుల వద్ద ధాన్యం కొనేవారు కరువయ్యారని ఆయన అన్నారు. రైతులు ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం విక్రయిస్తుండటంతో బస్తాకు రూ.500 వరకు నష్టం వస్తోందని చంద్బరాబు అన్నారు. రూ. 2 లక్షల కోట్ల సంపదైన అమరావతిని నాశనం చేశారని విమర్శించారు. ప్రైవేట్ లేఅవుట్లలో 5శాతం భూమి మధ్య తరగతికి పెనుభారమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది ఇలావుండగా, విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న లక్ష్మీనారాయణ.. ముందస్తు బెయిల్ కోరతూ రాష్ట్ర హైకోర్టును సోమవారం ఉదయం ఆశ్రయించారు. ఈ క్రమంలో 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెండో రోజుల క్రితం ఆయన ఇంట్లో సోదాలు చేపట్టిన సీఐడీ అధికారులు.. సోమవారం విచారణకు హాజరుకావాలని లక్ష్మీనారాయణకు నోటీసులు ఇచ్చారు.