కెసిఆర్ అమరావతి రాకపై ప్రత్యేకంగా: డిజిపికి చంద్రబాబు సూచనలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, గౌరవంలో ఏ విధమైన పొరపాట్లు దొర్లకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తున్నారు. కెసిఆర్ రాకపై ఆయన సోమవారం డిజిపి రాముడితో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వస్తుండడంతో రూట్మ్యాప్కు సంబంధించిన అంశాలపై డిజిపి రాముడుతో చంద్రబాబునాయుడు మాట్లాడారు. రూట్మ్యాప్ను వెంటనే సిద్ధం చేసి తెలంగాణ అధికారులకు అందివ్వాలని సూచించారు. హెలికాప్టర్, రోడ్డు మార్గానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయన డీజీపీని ఆదేశించారు.
అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన డిజిపి జెవి రాముడు, సురేంద్ర బాబులకు సూచించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణపై వారు చంద్రబాబుకు వివరించారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహం పరవళ్లు తొక్కుతోందని ఆయన అన్నారు. ఎక్కడ విన్నా అమరావతి పేరే ప్రతిధ్వనిస్తోందని అన్నారు.
అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసే భద్రతపై చంద్రబాబు డిజిపి రాముడు, సురేంద్ర బాబులతో సమీక్ష జరిపారు. మన నీరు మన మట్టి - మన అమరావతిపై చంద్రబాబు అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.