చంద్రబాబు పోలవరం టూర్ ఉద్రిక్తం-ప్రాజెక్టుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు-అక్కడే ధర్నా
ఏపీలో టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ఇవాళ ఉద్రిక్తంగా మారింది. నిన్న ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. ఇవాళ జంగారెడ్డి గూడెం మీదుగా పోలవరం వెళ్లారు. అయితే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి.
ఇవాళ సాయంత్రం జంగారెడ్డి గూడెం నుంచి పోలవరం గ్రామానికి చేరుకున్న చంద్రబాబు అక్కడే రోడ్ షో ఏర్పాటు చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లేందుకు బయలుదేరారు.కానీ అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లేందుకు చంద్రబాబు అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. పోలీసులతో టీడీపీ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో పోలవరం గ్రామం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డుపై చేరుకున్న చంద్రబాబు అక్కడే బైఠాయించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తనను పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడమేంటని పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. కానీ పోలీసులు మాత్రం వెనక్కితగ్గలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చంద్రబాబును వెళ్లనిచ్చేది లేదని భీష్మించారు. దీంతో టీడీపీ నేతలు నినాదాలు చేస్తూ చంద్రబాబుతో కలిసి బైఠాయించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వెళ్లే దారి మొత్తం టీడీపీ కార్యకర్తల హంగామాతో నిండిపోయింది.
చంద్రబాబు పోలవరం టూర్ ఉద్రిక్తం-ప్రాజెక్టుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు-అక్కడే ధర్నా#chandrababu #appolitics #polavaram #oneindiatelugu pic.twitter.com/PPDAt9oiBo
— oneindiatelugu (@oneindiatelugu) December 1, 2022