నరేంద్ర మోడీతో దోస్తీపై చంద్రబాబు డైలమానే
హైదరాబాద్: బిజెపితో కలిసి సాగుదామని ఆయన సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై ఇంకా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డైలమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. విభజనకు సహకరించిందనే నిందలను సీమాంధ్రలో బిజెపి కూడా మోస్తోంది. దీంతో ప్రజలు బిజెపికి కూడా వ్యతిరేకంగా ఉన్నారా అనుమానాలు చంద్రబాబుకు ఉన్నట్లు తెలుస్తోంది.
విభజన నేపథ్యంలో బిజెపికి కూడా ప్రజలు వ్యతిరేకంగా ఉంటే పొత్తు బెడిసికొడుతుందనే భావనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు కూడా బిజెపితో పొత్తుకు అంత సముఖంగా లేరు. అంతేకాకుండా కాంగ్రెసు నుంచి పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా, గల్లా జయదేవ్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి తురుపుముక్కగా ఉపయోగపడుతారని చంద్రబాబు భావిస్తున్నారు.

జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు శిల్పా మోహన్ రెడ్డి వంటివారు పార్టీలోకి రావడానికి సముఖత వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి కూడా పార్టీలోకి వస్తామని చెప్పారు. అనంతపురం జిల్లా నుంచి జెసి దివాకర్ రెడ్డి సోదరులను పార్టీలో చేర్చుకోవడానికి మార్గం సుగమమైంది.
తాజా పరిస్థితి చూస్తుంటే రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏకపక్షంగా ఫలితాలను సాధించే పరిస్థితి లేదని అర్థమవుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ధీటైన సమాధానం చెప్పే నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. కాంగ్రెసు మాత్రం రాయలసీమలో పూర్తిగా దిగజారే పరిస్థితి ఉంది.
నాయకుల వలసలు పెరుగుతున్న క్రమంలో బిజెపితో పొత్తు పెట్టుకుంటే అందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చునని చంద్రబాబు భావిస్తున్నారు. సొంతంగా బలాన్ని చాటేందుకు తగిన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో బిజెపితో ఎన్నికలకు ముందు పొత్తుకు ఆయన వెనకాడుతున్నట్లు చెబుతున్నారు. అవసరమైతే ఎన్నికల తర్వాత ఎన్డియెకు మద్దతు ఇవ్వవచ్చునని ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications