హైడ్రామా!: ముద్రగడపై బాబు వ్యూహం, చిరంజీవి-జగన్లకు ఝలక్?
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతోంది. ముద్రగడ గురువారం రాత్రి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరోవైపు, తుని ఘటనలో అరెస్టైన వారిని విడుదల చేసే వరకు దీక్ష ఆగదని కూడా ప్రకటించారు.
ముద్రగడ ఇష్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేయి సాధిస్తున్నారా? అంటే ఒకింత అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ముద్రగడ దీక్ష విషయంలో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ... అంతగా స్పందించినట్లుగా కనిపించడం లేదు. విపక్షాలు కూడా అదే మాట చెబుతున్నాయి.
అందుకు కారణాలు కూడా లేకపోలేదని అంటున్నారు. గతంలో కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష చేసినప్పుడు చంద్రబాబు ఆగమేఘాల మీద స్పందించింది. ఆయనతో చర్చలు జరిపి, దీక్ష విరమింప చేసే వరకు సీరియస్గా కనిపించింది.
కానీ, ఈసారి ముద్రగడ దీక్ష తొమ్మిదో రోజుకు చేరినా అంత సీరియస్నేస్ కనిపించడం లేదంటున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
ముద్రగడకు గత దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుతున్నామని, కాపు కమిషన్ విషయంలో గడువు పూర్తి కాలేదని, ఇలాంటి సమయంలో ఆయన దీక్ష చేయడం లేదని మంత్రులు మండిపడుతున్నారు. అంతేకాదు, తుని ఘటనలో ఆధారాలతోనే అసలైన నిందితులను అరెస్టు చేశామని టిడిపి చెబుతోంది.
వీటన్నింటి దృష్ట్యా.. ముద్రగడ దీక్ష విషయంలో అంత సీరియస్ నెస్ కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో, మరో కోణం కూడా ఉంది. ముద్రగడ దీక్షను కావాలనే మీడియా హైలెట్ చేయడం లేదని అంటున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయని, కానీ వాటిని హైలెట్ చేయడం లేదని అంటున్నారు.
మొత్తానికి పరిస్థితి చూస్తుంటే ముద్రగడ దీక్ష పైన గతంలో పెట్టినంత దృష్టి ప్రభుత్వం పెట్టడం లేదని అంటున్నారు.
తుని ఘటనలో సరైన నిందితులనే అరెస్టు చేశామని చెప్పడం, కాపులకు ఇచ్చిన హామీలని కచ్చితంగా నెరవేరుస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతుండటం, హామీల విషయమై ఓ వైపు ప్రాసెస్ కొనసాగుతుండగానే ముద్రగడ దీక్ష చేయడం వల్లే దీక్షకు అంత స్పందన రావడం లేదనేది టిడిపి వాదన. ముద్రగడ దీక్ష విషయంలో పెద్ద హైడ్రామానే సాగుతోందని అంటున్నారు.
చిరంజీవి, దాసరిలకు షాక్?
ముద్రగడ దీక్ష విషయమై చిరంజీవి, దాసరి నారాయణ రావులకు షాకేనని అంటున్నారు. ముద్రగడ దీక్షను ఎవరికి వారు క్యాష్ చేసుకునే ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్, వైసిపి తెరపైకి వచ్చాయి.
నాడు ముద్రగడ కిర్లంపూడిలో దీక్ష చేసినప్పుడు చిరంజీవి, దాసరిలు సంఘీబావం కోసం వెళ్తే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు మరోసారి దీక్ష నేపథ్యంలో నాలుగైదు రోజుల తర్వాత వారు తెరపైకి వచ్చారు. టిడిపికి హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజుల డెడ్ లైన్ విధించారు.
అయితే, ముద్రగడ అప్పటిలాగే దీక్ష విరమిస్తే.. విపక్షాలకు షాకేనని అంటున్నారు. ముద్రగడ దీక్ష విషయంలో ప్రభుత్వం పైన అదే పట్టుదలతో ముందుకు వెళ్లినా పైచేయి ఉండేలా.. టిడిపి ఎప్పటికప్పుడు ఆయన పైన విమర్శలు గుప్పిస్తూనే, విరమింప చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ దీక్ష విరమించినా అది ప్రభుత్వానికి ప్లస్ అవుతోంది.