మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు వ్యూహం.. అదుర్స్!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలకు చంద్రబాబు పరిశీలకులను నియమించారు.
వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలోనే బాబును నిలవరించాలని, అక్కడ ఓడించగలిగితే రాష్ట్రం మొత్తంమీద టీడీపీని ఈసారి సులువుగా ఓడించవచ్చని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. దీనికి ప్రతివ్యూహంగా రాయలసీమ మొత్తంమీద అత్యధిక నియోజకవర్గాలను గెలుచుకొని వైసీపీకి చెక్ పెట్టాలనేది చంద్రబాబు ప్రణాళిక.

పెద్దిరెడ్డిపై దృష్టిపెట్టిన చంద్రబాబు
కుప్పంలో తనను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మీద ప్రస్తుతం ఆయన దృష్టి సారించారు. పుంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాల్లో భాగంగా బాబు అక్కడ నిర్వహించిన రోడ్ షోలకు అనూహ్య స్పందన వ్యక్తమైంది. దీంతో పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈసారి ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డిని కచ్చితంగా ఓడిస్తామని చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.

ఇద్దరు పరిశీలకుల నియామకం
పుంగనూరు నియోజకవర్గానికి పరిశీలకుణ్ని నియమించారు. తిరుపతికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి బీఎన్ సుధాకర్ రెడ్డికి ఆ బాధ్యతలు కట్టబెట్టారు. అలాగే మరో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మరో నియోజకవర్గమైన పీలేరుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురా సుధాకర్ రెడ్డిని నియమించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ ఛార్జిలను వీరు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. పీలేరు నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. పుంగనూరు నియోజకవర్గానికి చల్లా రామచంద్రారెడ్డి ఇన్ చార్జిగా ఉన్నారు. పుంగనూరు, పీలేరులో ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని, అందుకు తగ్గట్లుగా ఇన్ఛార్జిలతో కలిసి పనిచేయాలంటూ పరిశీలకును చంద్రబాబు ఆదేశించారు.

రాయచోటిలో గెలిచి తీరాలి!
రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్కుమార్రెడ్డితో చంద్రబాబు సమావేశమయ్యారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాయచోటి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ గెలిచితీరాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రమేష్ కు చంద్రబాబు సూచించారు. నియోజకవర్గంలో చేపడుతున్న ఇదేం ఖర్మ కార్యక్రమం అమలు, స్పందన అడిగి తెలుసుకున్నారు. నాయకులంతా సమన్వయంతో పనిచేయడమే కాకుండా పార్టీని కూడా బలోపేతం చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications