పవన్ కళ్యాణ్పై నోరు చేసుకోవద్దన్న బాబు: అయినా రెచ్చిపోయిన కేశినేని
హైదరాబాద్: సినీ హీరో, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్కు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పవన్ తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా టీడీపీ ఎంపీలు ఆయనపై విరుచుకుపడడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్కు, టిడిపికి మధ్య అగాధం పెరిగిందని భావించారు. అయితే, అదేమీ లేదంటూ టిడిపి వర్గాలు అంటున్నాయి.
పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని ఆయన టీడీపీకి మిత్రుడని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జపాన్ నుంచి పార్టీ నేతలకు సూచించారు. ఆయన మనోగతం తెలిసిన తర్వాత వేడి చల్లారింది. పవన్ కల్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని పార్టీ అధినేత చంద్రబాబు సూచించినట్లు తెలిసినా విజయవాడ ఎంపీ కేశినేని నాని వంటివారు పపన్పై ఎదురు దాడికి దిగారు.

పవన్ కళ్యాణ్ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలను పార్టీ నేతలు జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. పవన్ కల్యాణ్ మన మిత్రుడని, గత ఎన్నికల్లో మన విజయానికి పనిచేశారని, ఆయనపై ఎవరూ ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేయవద్దనిస ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఎంపీలుగా చేసిన కృషిని చెబితే సరిపోతుందని, అంతకు మించి వద్దని చంద్రబాబు వారితో చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని ఆ నేతలు ఇతరులకు వివరించారు.
అయితే, పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా తన పేరు ప్రస్తావించి మాట్లాడటంతో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని మనసు నొచ్చుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై మాట్లాడటానికి బందరు ఎంపీ కొనకళ్ల నారాయణతో కలిసి ఆయన విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసి టీడీపీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. మీడియా సమావేశం రద్దు చేసుకోవాలని కోరారు.
కానీ అప్పటికే మీడియాకు సమాచారం పంపేశానని, ఇప్పుడు రద్దు చేస్తే వేరే రకంగా అనుకొంటారని ఆయన బదులిచ్చారు. అయితే, ఆచితూచి మాట్లాడాలని, పవన్పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని రాష్ట్ర కార్యాలయం సూచించింది. అలాగేనని నాని వారికి చెప్పారు. కాని తర్వాత మాత్రం పవన్పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విషయం తెలిసి టీడీపీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులు తల పట్టుకొన్నారు.












Click it and Unblock the Notifications