నిద్రపోని చంద్రబాబు: అర్థరాత్రి రాజమండ్రిలో పర్యటన
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా ఇటీవల తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తయ్యారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. నిద్ర కూడా పోకుండా భక్తులకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు. ట్రాఫిక్ పరిస్థితిని కూడా పర్యవేక్షించారు.
శని, ఆదివారాల్లో పుష్కరాలకు భక్తులు పోటెత్తడంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం 5.30 వరకు ఆయన రాజమండ్రి నగరం మొత్తం పర్యటించారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలిస్టూ, భక్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రిలో ప్రైవేటు వాహనాల కోసం మరో నాలు గు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
చంద్రబాబు నేరుగా ఆర్టీసీ బస్టాండుకు వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. తిరుగు ప్రయాణానికి బస్సులు లేవని వారు ఆరోపించడంతో అందుబాటులో ఉన్న బస్సులను నడపాలని, వాటి సంఖ్య పెంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. శనివారం చోటుచేసుకున్న ట్రాఫిక్ జాంలపైనా చంద్రబాబు దృష్టి పెట్టారు.
విశాఖపట్నం, విజయవాడ జాతీయ రహదారులపై ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిచిపోతున్నందున రెండు జిల్లాల్లోను టోల్గేట్లను మూసివేయాలని ఆదేశించారు. వాహనాల రద్దీ మరింత పెరిగితే వాటిని పుష్కర్ నగర్ల వద్ద ఆపేసి, అక్కడే భక్తులకు భోజన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు విశాఖ జిల్లా నక్కపల్లిలో 10వేల మందికి ఆదివారం భోజన ఏర్పాట్లు చేశారు. ఉదయం 5.30కు తన బసకు చేరిన ఆయన తిరిగి ఉదయం 10.30కు సమీక్షకు సిద్ధమయ్యారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పుణ్యస్నానానికి తర లి వస్తున్న జనాలతో పుష్కర ఘాట్లు కిక్కిరిసి పోతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాలు జరుగుతున్న ప్రాంతాల్లో సోమ, మంగళవారాలను సెలవులుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్ల వద్ద 24 గంటలూ స్నానానికి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.