చెత్త: కారు దిగి క్లాస్ తీసుకున్న చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చెత్త పేరుకు పోవడం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతటా స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పరిశుభ్రత పైన అప్రమత్తంగా ఉంటే.. సచివాలయంలో ఆ ఛాయలు కనిపించడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయన గురువారం ఉదయం సచివాలయంలోని ఎల్ బ్లాకు వద్ద తన ఛాంబరుకు వచ్చారు. ఈ సమయంలో ఎల్ బ్లాకుకు అనుకొని ఉన్న సర్వహిత బ్లాక్ వద్ద పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి ఉంది. దీనిని గమనించిన చంద్రబాబు, వెంటనే తన వాహనం దిగి చెత్త ఎందుకు పేరుకుపోయిందని ప్రశ్నించారు.
స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం అందరిలోను స్ఫూర్తి నింపేందుకు చేపట్టినదని, సచివాలయంలోనే అశుభ్రత ఎలా అని మండిపడ్డారు. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు అక్కడి చెత్తను తొలగించే ప్రయత్నం ప్రారంభించారు. హుటాహుటిన రెండు లారీల్లో చెత్తను తొలగించారు.