చులకనగా చూశారు, జగన్ అండతో అణగదొక్కాలని: మోడీ-పవన్లపై చంద్రబాబు
Recommended Video

అమరావతి: నాలుగేళ్లయినా ఏపీకి న్యాయం జరగడం లేదని గ్రహించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని, అదే రోజు అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో ప్రవేశపెట్టామని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.
ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని చెప్పారు. కేంద్రం అన్యాయం చేసినా ఎవరికీ ఇబ్బంది కావొద్దని తాను రాత్రింబవళ్లు పని చేస్తున్నానని, సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. ఏపీకి సాయం చేయాలనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఆయన విజయవాడలో జరిగిన ముస్లీం సమ్మేళనంలో మాట్లాడారు.

హామీలు అడిగితే చులకన చేశారు
ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు చెప్పారు. హామీలు నెరవేర్చమని అడిగితే చులకన చేశారన్నారు. నేను ఢిల్లీకి 29సార్లు వెళ్లాలనని, కానీ సాయం చేయలేదన్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ప్రధాని మోడీకి చెప్పానన్నారు.

కేంద్రంతో వైసీపీ లాలూచీ
విభజనతో మనం తీవ్రంగా నష్టపోయామని చంద్రబాబు అన్నారు. వైసీపీ కేంద్రంతో లాలూచీ పడుతోందని ధ్వజమెత్తారు. మనం అభివృద్ధి చేస్తూ పోరాటం చేయాలన్నారు. మనం నష్టపోవద్దన్నారు. అందుకే అభివృద్ధి చేస్తూ హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు.

మనం ఈ దేశంలో భాగం
మనం ఈ దేశంలో భాగం కాబట్టి మనకు ఇచ్చిన హామీలను సాధించే వరకు పోరాడుదామని చంద్రబాబు అన్నారు. అభివృద్ధిలో భారత దేశంలోనే ముందుండాలన్నారు. ఏకపక్షంగా టీడీపీకి సహకరించేందుకు మీరంతా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వైసీపీ అండతో అణగదొక్కాలని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకొని టీడీపీని అణగదొక్కాలని బీజేపీ చూస్తోందని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎప్పుడూ తప్పు చేయదని, కాబట్టి తాను ఎవరికీ భయపడేది లేదన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో జగన్ మాట్లాడలేదని, నేను మాత్రం నిలదీశానని చెప్పారు.

పవన్ కళ్యాణ్పై ఆగ్రహం
కేంద్రంతో పోరాడాల్సింది పోయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నాపై విమర్శలు చేస్తే లాభమేమిటన్నారు. ఆ రోజు స్వర్ణ దేవాలయం విషయమై తొలిసారి వ్యతిరేకించింది టీడీపీయేనని, ట్రిపుల్ తలాక్ విషయంలో స్పందించింది తానే అన్నారు. ముస్లీం సోదరులు ఉండే ప్రాంతాల్లోకి వెళ్లి వారిలో చైతన్యం తీసుకు రావాలన్నారు.

నా పైకి రెచ్చగొడుతన్నారు, మీ అండ చాలు
తాను ఏపీకి రావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే బీజేపీ కావాలని కొంతమందిని తనపైకి రెచ్చగొడుతుందని పవన్, జగన్లను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. తాను సవాల్ చేసి చెబుతున్నానని, ఈ దేశంలో అత్యంత సుపరిపాలన ఇస్తోంది మన రాష్ట్రమే అన్నారు. సంక్షేమ పథకాల్లో, ఎవరికీ ఇబ్బందులు ఉండకుండా.. అన్నింట్లో టెక్నాలజీ ఉపయోగిస్తున్నామన్నారు. నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని, మీ అండ నాకు కావాలని, నేను ఎప్పుడూ చేసేది న్యాయమైన పోరాటామని, తాను రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నానని చెప్పారు. మన కార్యకర్తలు రాష్ట్రంలో తిరిగి ముస్లీం సోదరుల్లో చైతన్య భావం తీసుకు రావాలన్నారు.












Click it and Unblock the Notifications