కర్నూలు నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫెరెన్స్.!తాజా రాజకీయ పరిణామాలపై చర్చ.!
కర్నూలు/హైదరాబాద్ : తాజా రాజకీయ పరిణామాలపై టీడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నేతలతో సంప్రదింపులు జరిపారు. టీడిపి నాయకుల అరెస్టులతో తలెత్తిన అంశాలపై చంద్రబాబు నాయకులతో చర్చించారు. బిసి జనార్ధన్ రెడ్డి అరెస్టు పై కర్నూలు నాయకులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, జనార్ధన్ రెడ్డి ఇంటిపైకి దాడి చేయడానికొచ్చి జనార్ధన్ రెడ్డిపైనే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కరోనా విలయతాండవం చేస్తోంది.. కక్షపూరిత రాజకీయాలెందుకన్న చంద్రబాబు..
పోలీసులు ఉన్నది దొంగలకు రక్షణ కల్పించడానికా? ధర్మాన్ని సంరక్షించడానికా అని సూటిగా నిలదీసారు. బిసి జనార్ధన్ రెడ్డిపై, తెలుగుదేశం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా దుర్కొంటామన్నారు చంద్రాబాబు. కర్నూలులో కరోనాతో, బ్లాక్ ఫంగస్ తో ప్రజలు చనిపోతుంటే వైసీపీ నాయకులు మాత్రం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం నాడు ఎనిమిది మంది తెలుగు దేశం పార్టీ నాయకులను అరెస్టు చేసారని, అందులో ఆరుగురిని ఇంతవరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

అక్రమ కేసులకు భయపడొద్దు.. కర్నూలు జిల్లా నేతలకు భరోసా ఇచ్చిన టీడిపి ఛీఫ్..
బిసి జనార్ధన్ రెడ్డి విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ దుర్మార్గాలపై కరోనా నిబంధనలు పాటిస్తూ వర్చువల్ ఎజిటేషన్ కు చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసులు చేస్తున్న దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, హైకోర్టు డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ అని వ్యాఖ్యానించినా అధికార పార్టీకి సిగ్గురాలేదని బాబు ఆవేశం వ్యక్తం చేసారు. టెలీ కాన్పెరెన్సులో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి అఖిల ప్రియ, వెంకటరెడ్డి, ప్రతాప్ రెడ్డి, తిక్కారెడ్డి, జాఖిర్ హుస్సేన్, నరసింహారెడ్డి, రామాలింగారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంతోమందిని కరోనాకు బలిస్తున్నారు.. కరోనా నియంత్రణ చర్యలేవన్న లోకేష్..
సహజీవనం చేసుకోండి అంటూ ప్రజల్ని కరోనాకి బలిస్తూ మరోపక్క ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు పనిలో బిజీగా ఉన్నారని ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసారు టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర నేతల పై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు లోకేష్. కరోనా క్లిష్ట సమయంలో కూడా ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం చాలా దారుణమైన అంశమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రజా సంక్షేమం జగన్ కు అవసరం లేదు..కక్ష పూరిత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తారని లోకేష్ విమర్శ
అక్రమ కేసులు నిలవవు అని తెలిసినా ప్రతిపక్ష నేతల్ని వెంటాడి, వేధించి జైలుకి పంపి జగన్మోహన్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. తంలో చేసిన తప్పులకు పదుల సంఖ్యలో అధికారులు జైలుకి వెళ్లారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుడు పనులకు వందల సంఖ్యలో అధికారులు జైలుకు పోవడం ఖాయమని లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నా జగన్ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుందని, కరోనా కట్టడికి చర్యలు తీసుకోకవడంలో ఏపి ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసిందని లోకేష్ విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications