చిరంజీవి ఏం చేశాడు: ముద్రగడకు బాబు థ్యాంక్స్, జగన్పై ఫైర్, 'విశాఖకు విరాట్'
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తుని విధ్వంసం, కాపులకు రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవిలపై సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పరోక్షంగా జగన్ పైన ధ్వజమెత్తారు. చిరంజీవి పైన నేరుగా విమర్శలు చేశారు. కుల, మతాలను రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని చెప్పారు.
కాపులకు హామీ ఇచ్చాం.. నెరవేరుస్తాం
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తాము హామీ ఇచ్చామని, దానిని నెరవేరుస్తామన్నారు. కులం, మతం, ప్రాంతం మనం కోరుకొని పుట్టమని చెప్పారు. ఎవరు ఏ కులంలో, మతంలో, ప్రాంతంలో పుట్టినా.. తన దృష్టిలో రెండే కులాలు అని ఒకటి పేద కులం, రెండో ధనవంతుల కులం అన్నారు.
నా జీవితాన్ని మార్చింది
తన మద్దతు ఎప్పుడు పేదవారికే ఉంటుందని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తాము చెప్పామని, తమకు ఎవరు చెప్పకపోయినా అది నెరవేరుస్తామన్నారు. ఇచ్చిన హామీ పైన వెనక్కి పోయేది లేదన్నారు. తాను 208 రోజులు పాదయాత్ర చేసి అందరి సమస్యలు అధ్యయనం చేశానని చెప్పారు.
అది నా జీవితాన్ని మార్చాయన్నారు. తాను రెండుసార్లు నిరవధిక నిరాహార దీక్ష చేశానని చెప్పారు. కాపు వర్గంలోని పేదలకు కచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. కులాలు మనం గీసుకున్న గీతలు అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నాలు అడుగడుగునా ఉంటాయని చెప్పారు.
బీసీలకు అన్యాయం జరగకుండా చేస్తామన్నారు. బీసీలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని, వారికి కచ్చితంగా అన్యాయం జరగనివ్వమని చెప్పారు. గోదావరి జిల్లాల ప్రజలు తుని విద్వంసం సృష్టించరని చెప్పారు. బయటి నుంచి వచ్చిన వారే అది చేశారన్నారు.
కుల, మత, ప్రాంతాలను రాజకీయాలక వాడుకోవడం బాధాకరమన్నారు. కాపు అంశం సున్నితమైనదని, దానిని జఠిలం చేయవద్దన్నారు. రాజకీయం కోసం కుల, మత, ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లోను వాడుకోవద్దన్నారు. తుని ఘటనలో అసలైన దోషులను శిక్షిస్తామన్నారు. తుని ఘటన పైన విచారణ జరుగుతోందని, అమాయకులను శిక్షించమన్నారు. నాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తుని విధ్వంసానికి పాల్పడ్డాయన్నారు.
చిరంజీవి ఏం చేశాడో చెప్పండి, ముద్రగడకు థ్యాంక్స్
చిరంజీవి కాపుల కోసం ఏం చేసారని ప్రశ్నించారు. కాపుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏమైనా చేసిందా అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని, అలాగే తమ మాట విని దీక్ష విరమించిన ముద్రగడ పద్మనాభంకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖను మెచ్చుకున్న మోడీ, నౌకాదళ కేంద్రంగా అన్న పారికర్
విశాఖ సుందరమైన నగరం అన్నారు. భారత నావికాదళానికి కేంద్ర బింధువుగా విశాఖ నగరం ఉంటుందన్నారు. ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ అద్భుతంగా సాగిందన్నారు. అద్భుతంగా నిర్వహించిన ఇండియన్ నేవీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్లీట్ రివ్యూను ఆరు లక్షల మంది హాజరయ్యారని చెప్పారు.
50 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వందనం సమర్పించాయన్నారు. విశాఖ నగరం పరిశుభ్రంగా ఉందని ప్రధాని మోడీ కూడా ప్రశంసించారన్నారు. దేశ నౌకాదళ కేంద్రంగా విశాఖను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారన్నారు.
అంతకుముందు విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి రూ.4 లక్షలకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 44 దేశాల ప్రతినిధులు వచ్చారని చెప్పారు.
మన ఊళ్లోనే జాతర జరిగితే ఎంతో సంతోషిస్తామని, అలాంటిది దేశంలోని 50 దేశాల నావికా దళాలు మన భూమి పైకి వచ్చి ప్రధాని, రాష్ట్రపతికి వందనం సమర్పించడం అరుదైన అవకాశమన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మంచి భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు.
హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టాం
ఐటీ ద్వారా హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టామన్నారు. ఏపీకి మంచి తీర ప్రాంతం ఉందని చెప్పారు. మనం ఓడ రేవులను అభివృద్ధి చేసుకోవచ్చునని చెప్పారు. దుబాయ్, శ్రీలంక.. ఇలా ఏది అభివృద్ధి జరిగినా పోర్ట్ బేస్డ్గా ఉండటంతో అభివృద్ధి సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో ఏపీ లాజిస్టిక్ హబ్గా తయారవుతుందన్నారు.
భారత దేశంలోనే ఏపీని నెంబర్ వన్గా చేసుకోవచ్చునని చెప్పారు. ఇస్తాంబుల్ ఆదర్శంగా రాష్ట్రంలో ఆతిథ్య రంగాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
విశాఖకు విరాట్ యుద్ధ నౌక
అంతకుముందు పర్యాటక సమీక్షలో చంద్రబాబు యుద్ధ నౌక విరాట్ గురించి ప్రస్తావించారు. యుద్ధ నౌక విరాట్ను రాష్ట్రానికి అప్పగించేందుకు భారత నావికాదళం అంగీకరించిందని చంద్రబాబు చెప్పారు. త్వరలో విశాఖలో విరాట్ కొలువుదీరనుందని తెలిపారు. విరాట్లో సకల సౌకర్యాలు ఉంటాయి. హెలిప్యాడ్, 1500 గదిలు ఉంటాయి. ఐఎన్ఎస్ విరాట్ను రాష్ట్రంలో పెట్టాలని కోరినట్లు చెప్పారు. దానికి అంగీకరించారన్నారు.