స్వయంగా పెన్షన్లు పంచనున్న చంద్రబాబు-లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మరీ..!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ తొలి కేబినెట్ లోనే నిర్ణయం తీసుకుంది. అంతే కాదు పెరిగిన పింఛన్ మొత్తాల్ని ఏప్రిల్ నుంచే వర్తింపచేస్తూ బకాయిలతో పాటు పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. అదే సమయంలో స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు.
జూలై 1న ఇవ్వబోయే పెన్షన్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వాలంటీర్ల స్ధానంలో సచివాలయ సిబ్బందితో ఈ పెన్షన్లు ఇప్పించడంతో పాటు స్థానికంగా టీడీపీ నేతలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తోంది. అదే సమయంలో లబ్దిదారులను ఉద్దేశించి స్వయంగా సీఎం చంద్రబాబు ఓ లేఖ కూడా రాశారు. ఇంతటితో ఆగకుండా స్వయంగా తానే లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేందుకు సీఎం ప్లాన్ చేశారు.

దేశంలో తొలిసారిగా ఓ సంక్షేమ పథకం పంపిణీ కోసం స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నవారు. ఇందులో భాగంగా జూలై 1న అమరావతి రాజధానిలోని తాడేపల్లి, పెనుమాక ప్రాంతాల్లో చంద్రబాబు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లబోతున్నారు. ఇచ్చిన మాట మేరకు పెన్షన్ పెంపు, బకాయిలతో కలిపి చెల్లిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని లబ్దిదారులకు స్వయంగా కలిసి వివరించాలని సీఎం నిర్ణయించారు. దీంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications