కేంద్రంపై బాబు అసంతృప్తి! నా తండ్రి ఎన్టీఆర్ ఓ నియంత: బాలకృష్ణ
అమరావతి/హైదరాబాద్: ఏపీలో అపారమైన వనరులు, అపరిమిత భూబ్యాంక్, సమృద్ధిగా నీళ్లు, నిరంతర విద్యుత్ ఉన్నాయని.. కావాల్సిందల్లా కేంద్రం నుంచి సహకారమేనని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు.
గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో రాయలసీమ నీటి అవసరాలను తీర్చడానని తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా చంద్రబాబు అభివర్ణించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో నీతి అయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పైవిధంగా స్పందించారు.
కాగా, ఆంధ్రజ్యోతి పత్రిక ఇంటర్వ్యూలో చంద్రబాబు కేంద్రం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం, అవమానం జరిగిందని చెప్పారు. అయినా కుమిలిపోవడం లేదని, కసితో కష్టపడుతామని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో కేంద్రం నుంచి తగినంత సాయం రావడం లేదని, అయినా వదిలేది లేదని చెప్పారు. జన్మభూమిలో ప్రజలకు అన్నీ వివరిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి సాయం వచ్చే వరకు వదిలి పెట్టే ప్రసక్తి లేదని చెప్పారు.
ఆహార భద్రత ఎన్టీఆర్ ఘనత: బాలకృష్ణ
ఆహార భద్రత చట్టం గురించి కొత్తగా చెప్పుకుంటున్నారని, కానీ ఈ పథకాన్ని గతంలోనే ఎన్టీఆర్ అమలు చేసి చూపించారని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. దేశంలో ఎన్నో విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే అన్నారు.
ఎన్టీఆర్ నియంత అని, నియంతలా వ్యవహరించడం వల్లే ప్రజలకు చేయాలనుకున్న మేలు చేయగలిగారన్నారు. రాజకీయ పట్టువిడుపులను పట్టించుకోలేదన్నారు. టిడిపి అంటేనే బిసిలు అని, టిడిపి గుండెచప్పుడు బిసిలు అన్నారు. బిసిల కోసం ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని, రూ.5 లక్షల వరకు రుణమివ్వాల్సి ఉందన్నారు.
బాలకృష్ణ సంస్కృతంలో, తెలుగులో డైలాగులు చెప్పి అలరించారు. 'నా పేరు చంద్రశేఖర వర్మ. నాలోని అహం పేరు డిక్టేటర్. నీ చావు చూడాలనుకుంటే దానిని టచ్ చేయ్' అంటూ తాజాగా నటిస్తున్న డిక్టెటర్ సినిమా నుంచి ఓ డైలాగ్ చెప్పారు.
కాలం వెంట మనం వెళ్లడం కాదు, న వెంటే కాలం వచ్చేలా పని చేద్దామని కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. బుధవారం సంక్షేమ భవన్లో ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ చైర్మన్గా రంగనాయకులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.